ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు
ABN , Publish Date - May 07 , 2025 | 12:49 AM
వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
పచ్చని కాపురాల్లో చిచ్చు
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడ వారితోనే పరిచయాలు
భాగస్వామ్యులను వదిలించుకునేందుకు ప్రియుడు/ప్రియురాలితో కలిసి అఘాయిత్యం
నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న హత్యలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పచ్చటి సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. భాగస్వామ్యుల్లో ఏ ఒక్కరు దారితప్పినా ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా నగరంలో హత్యలు పెరిగిపోతుండడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
పరాయి వ్యక్తులతో మాట్లాడినప్పుడు మొద ట్లో ఎలాంటి ఆలోచనలు ఉండనప్పటికీ, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా నిరంతరం టచ్లో ఉండడం వల్ల చనువు పెరిగి, సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కొందరు తమ జీవిత భాగస్వామిని అడ్డుతొలగించుకోవడానికి వెనుకాడడం లేదు. ఇటీవల కూర్మన్నపాలెంలో జరిగిన దంపతుల హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అలాగే మారికవలస రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న మహిళ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తనతో ఎక్కువ సమయం గడపాలంటూ అతనిపై మహిళ ఒత్తిడి చేసేది. దీంతో ఆమెను అడ్డుతొలగించుకునేందుకు సరదాగా గడుపుదామంటూ బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి హత్యచేసి, ఆపై మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. కొద్దిరోజుల కిందట బోయపాలెంలో నివాసం ఉంటున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్య అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి అతడిని చంపేసింది. మృతదేహాన్ని వారిద్దరే ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి మారికవలస సమీపంలో పడేశారు. అనంతరం రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. అదేవిధంగా కొద్దిరోజుల కిందట భీమిలికి చెందిన టైల్స్ కాంట్రాక్టర్ భార్య తన చిన్ననాటి స్నేహితుడైన విశాలాక్షినగర్కు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం వచ్చిందని భర్తను నమ్మించి, తన చిన్ననాటి స్నేహితుడితో విశాలాక్షినగర్లో గడిపి తిరిగి ఇంటికి వెళ్లేది. భార్యపై అనుమానం వచ్చి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక మహిళతో విభేదాలు తలెత్తడంతో రుషి అనే అతను కొమ్మాదిలో తాను అద్దెకుండే ఇంట్లోనే ప్రియురాలిని చంపేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి సీల్ చేశాడు. ఆరు నెలలు గడిచినా రుషి ఇంటికి రాకపోవడంతో యజమాని ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ప్లాస్టిక్ డ్రమ్ముసీల్ తీసి చూసేసరికి మహిళ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళగా నిర్ధారించి, నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో జరిగిన ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు పెరుగుతుండడం నగరవాసులతోపాటు పోలీస్ వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
ముగింపు ఎప్పుడూ విషాదమే
కె.కనకమహాలక్ష్మి, కౌన్సిలర్, ఏయూ ఉమెన్ స్టడీ డిపార్ట్మెంట్
వివాహేతర సంబంధాల ముగింపు ఎప్పుడైనా విషాదమే అనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. గతంలో పరాయి వ్యక్తులు ఎదురుపడితే నేరుగా ముఖం చూసి మాట్లాడడానికి భయపడే పరిస్థితి. ఇప్పుడు అలాంటి భయం కనిపించడం లేదు. మారిన పరిస్థితులు కారణంగా వివాహేతర సంబంధం తప్పుకాదనే భావన చాలామందిలో కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాము తప్పుచేసినా, తమ భాగస్వామి మాత్రం తప్పు చేయకూడదనే దంపతులు కోరుకుంటున్నారు. గతంలో మహిళా పోలీస్ స్టేషన్కు అనుబంధంగా ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ చేసినప్పుడు ప్రతిరోజూ 12 నుంచి 15 కేసులు వివాహేతర సంబంధాలకు సంబంధించినవే ఉండేవి. వివాహేతర సంబంధం మోజులో ఉన్నప్పుడు తాము చేసేది తప్పుగా వారికి కనిపించదు. పైగా తప్పు అని చెప్పేవారిపైనా, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించేవారిపైనా పట్టలేనంత కక్షతో రగిలిపోతుంటారు. ఈ క్రమంలోనే ఎంతటి దుశ్చర్యకైనా దిగుతున్నారు. ఇలాంటి పోకడల కారణంగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎదురయ్యే పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా మాత్రమే వివాహేతర సంబంధాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యపడుతుంది.