యోగాంధ్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:42 AM
ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి
ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు
8 జిల్లాలకు చెందిన 156 మంది అధికారులకు బాధ్యతలు
యోగాంధ్రపై నేడు మంత్రుల కమిటీ సమావేశం
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జి.వీరపాండియన్, కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున చేపట్టే ఈ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకునే అవకాశం ఉందని, అందువల్ల ప్రతిఒక్కరూ సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆర్కే బీచ్లో ప్రధాన వేదిక నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డు పొడవునా విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్, ఎల్ఈడీ స్ర్కీన్లు, డ్రోన్లను ఏర్పాటు చేయడంతో పాటు రవాణా, తాగునీరు, తదితర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, రాష్ట్ర స్థాయి అధికారులు సూర్యతేజ, దినేశ్కుమార్, అభిషిత్, తదితరులు పాల్గొన్నారు.
8 జిల్లాల నుంచి 156 మంది అధికారులు
నగరంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు నెలకొల్పాలని ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డులో ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి, వాటిని పర్యవేక్షించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా నుంచి కాకినాడ వరకు ఎనిమిది జిల్లాలకు చెందిన 156 మంది అధికారులను ఈ నెల 15 నుంచి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఇక్కడే పనిచేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు (జాయింట్ కలెక్టర్ క్యాడర్), 31 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఏడుగురు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, మరో 109 మంది తహశీల్దార్ కేడర్ అధికారులు ఉన్నారు.
నేడు మంత్రుల కమిటీ సమావేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి మంగళవారం మంత్రుల కమిటీ కలెక్టరేట్లో సమావేశం కానున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయస్వామితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నతాఽధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.