సొంత భవనం ఉన్నా పరాయి పంచనే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:24 AM
మండల శాఖా గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించినా పరాయి పంచన కొనసాగుతున్న దుస్థితి జి.మాడుగులలో నెలకొంది. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.

ఇదీ మండల శాఖా గ్రంథాలయం దుస్థితి
విద్యుత్ సదుపాయం లేక ప్రారంభించిన వెంటనే మూసివేత
కమ్యూనిటీ భవనంలో కొనసాగుతుండడంతో ఇబ్బందులు
జి.మాడుగుల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండల శాఖా గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించినా పరాయి పంచన కొనసాగుతున్న దుస్థితి జి.మాడుగులలో నెలకొంది. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.
మండల కేంద్రంలో రూ.20.65 లక్షల వ్యయంతో మండల శాఖా గ్రంథాలయ భవనాన్ని నిర్మించి గత ఏడాది ఫిబ్రవరి 10న అట్టహాసంగా ప్రారంభించారు. అయితే విద్యుత్ సదుపాయం, ప్రహరీ గోడ లేకపోవడంతో ఈ భవనాన్ని వినియోగించడం లేదు. ఈ గ్రంథాలయాన్ని స్థానిక కమ్యూనిటీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ కమ్యూనిటీ భవనంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (కో-ఆపరేటివ్ బ్యాంకు) కొనసాగుతోంది. ఒకే భవనంలో కో-ఆపరేటివ్ బ్యాంకు, గ్రంథాలయం కొనసాగుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. గ్రంథాలయానికి సొంత భవనం ఉన్నా విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కమ్యూనిటీ భవనంలో కొనసాగించాల్సి వస్తోందని లైబ్రేరియన్ మహేశ్ తెలిపారు. గ్రంథాలయ భవనానికి విద్యుత్ సదుపాయం కల్పించి, ప్రహరీ నిర్మించి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.