రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కులు ఏర్పాటు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:08 PM
జిల్లాలో రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుపై బుధవారం వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుపై బుధవారం వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డుంబ్రిగుడ మండలం అరకులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి మే ఒకటిన శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో అరకు బ్రాండ్ పేరున కాఫీ, మిరియాలు, పసుపు, చిరు ధాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ సర్వే, పీఎంఈజీఏ దరఖాస్తుల స్వీకరణ, పథకాలు మంజూరు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై సమీక్షించారు. అల్లూరి జిల్లాకు సంబంధించి గొలుగొండ మండలంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు అనకాపల్లి కలెక్టర్ 250 ఎకరాల స్థలాన్ని గుర్తించారన్నారు. అక్కడ అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, సహాయ సంచాలకులు రమణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నంద్, జిల్లా ఉద్యానవ నాధికారి పి.రమేశ్కుమార్రావు, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి లక్ష్యం
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర ప్రణాళికలపై బుధవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యానవన సాగును విస్తరించాలని, మండలాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అందుకు గానూ మండల, డివిజన్, జిల్లా స్థాయిలో వర్కుషాపులు నిర్వహించాలన్నారు. 15 శాతం వృద్ధి సాధించేందుకు ఎటువంటి ప్రణాళికలు తయారు చేశారో పూర్తి సమాచారంతో వర్కుషాపులకు అధికారులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, ట్రైనీ కలెక్టర్ రంజీవి నాగవెంకట్ సాహిత్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నంద్, జిల్లా ఉద్యానవనాధికారి పి.రమేశ్కుమార్రావు, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్, సీపీవో ఆర్కే.పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.