పుస్తకాలతో విజ్ఞానం వృద్ధి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:22 PM
పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందని శాసనసభాపతి సీహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
రోజూ కొంతసేపైనా పుస్తక పఠం చేయాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందని శాసనసభాపతి సీహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న అనకాపల్లి పుస్తక మహోత్సవాన్ని మంగళవారం సాయంత్రం ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఖాళీ సమయాల్లో ప్రముఖుల రచనలు చదవాలని సూచించారు. ప్రస్తుత యువత సెల్ఫోన్లకు బందీలు కావడం బాధాకరమన్నారు. కవులు, సాహితీవేత్తలు రాసిన పుస్తకాలను నేటి తరం తప్పక చదవాలని సూచించారు. తాను పుస్తక ప్రియుడునని, రోజులో కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తానని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, సాహిత్యానికి పుస్తకాలను ప్రతిఒక్కరూ చదవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనకాపల్లిలో మొట్టమొదటిసారి పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అయ్యన్న వెంటన యూఎఫ్ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర వున్నారు.