జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:10 PM
జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమష్టిగా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
మెగా పీటీఎంకు పక్కాగా ఏర్పాట్లు
వంద రోజుల విద్యా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి
పీఎం జన్మన్ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశం
పాడేరు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమష్టిగా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై మంగళవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఖనిజ లభ్యతపై మండలాల వారీగా వివరాలను సేకరించి నివేదిక రూపొందించాలని, క్వారీల నిర్వహణపై పర్యవేక్షణ ఉండడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే యువతను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని, గిరిజన సేంద్రీయ ఉత్పత్తులైన కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, చింతపండు, చిరుధాన్యాల ప్రోసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలన్నారు. ప్రతి లబ్ధిదారునికి రేషన్ సరుకులు పక్కాగా అందేలా చర్యలు చేపట్టాలని, ధాన్యం సేకరణ పక్కాగా చేపట్టాలని, పీఎం జన్మన్ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెన్త్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన వంద రోజుల విద్యాప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ నెల 5న మెగా పీటీఎంను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి విద్యాలయంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్వీ రమణారావు, సీపీవో ప్రసాద్, డీఆర్డీఏ పీడీ వి.మురళి, జిల్లా సహకార అధికారి కృష్ణంరాజు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.