గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగింపుపై సందిగ్ధం
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:16 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి యూనివర్సిటీ అధికారులు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం క్యాంపస్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చిన ఏయూ అధికారులు
గతంలో మాదిరిగా తమనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రస్తుతం ఉన్న అతిథి అధ్యాపకులు
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి యూనివర్సిటీ అధికారులు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం క్యాంపస్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రస్తుతం ఉన్న అతిథి అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇప్పటివరకూ పాఠాలు చెప్పేందుకు అనుగుణంగా షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఏయూలోని వివిధ విభాగాల్లో 400 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీని ప్రసాదరెడ్డి వీసీగా ఉన్న సమయంలో తొలగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ శశిభూషణ్ తిరిగి తీసుకున్నారు. వారికి సెమిస్టర్/పేపర్కు రూ.45 వేలు చొప్పున వేతనంగా చెల్లిస్తుంటారు. ఏటా రెన్యువల్ చేస్తుంటారు. అయితే, ఏయూ అధికారులు తొలిసారి ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, దీనిని ప్రస్తుతం పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు రెన్యువల్ చేయాలని, లేదంటే సామర్థ్యాలను తెలుసుకునేందుకు రివ్యూస్ కండక్ట్ చేయాలని కోరుతున్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటివరకూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13 వరకూ అవకాశం ఇచ్చారు. బుధవారం నుంచి 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని షెడ్యూల్లో ప్రకటించారు. కానీ, బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అతిథి అధ్యాపకులు వర్సిటీలోని అధికారులను కలిసి తమ ఇబ్బందులను తెలియజేస్తున్నారు.