బీచ్రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సు
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:11 AM
పర్యాటకులు సముద్ర సోయగాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా బీచ్రోడ్డులో నడపనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు బుధవారం సాగర్నగర్ ఇస్కాన్ మందిరం సమీపంలో ఏర్పాటుచేసిన చార్జింగ్ స్టేషన్కు చేరుకుంది.
త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి
తొట్లకొండ నుంచి ఆర్కే బీచ్ వరకు నడిపే యోచన
పరిశీలించిన పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్
సాగర్నగర్ (విశాఖపట్నం), జూలై 2 (ఆంధ్రజ్యోతి): పర్యాటకులు సముద్ర సోయగాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా బీచ్రోడ్డులో నడపనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు బుధవారం సాగర్నగర్ ఇస్కాన్ మందిరం సమీపంలో ఏర్పాటుచేసిన చార్జింగ్ స్టేషన్కు చేరుకుంది. దీనిని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ పరిశీలించారు. బస్సు పనితీరుపై ఆరా తీశారు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడివరకు నడపనున్నారని ప్రశ్నించగా మొత్తం 62 సీట్లు ఉన్నాయని, తొట్లకొండ నుంచి ఆర్కే బీచ్ వరకూ బీచ్రోడ్డులో బస్సును నడిపేందుకు నిర్ణయించామని అధికారులు వివరించారు. తొలివిడత ఒక బస్సు వచ్చిందని, త్వరలో మరో రెండు బస్సులు చేరుకుంటాయన్నారు. ఈ సందర్భంగా బీచ్రోడ్డులోని మ్యూజియాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ పరిమిత టికెట్ ధర నిర్ణయించి పర్యాటకులకు ప్యాకేజీగా అందించాలని సీఎస్ వారికి సూచించారు. ఆయన వెంట జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ జీవీవీ జగదీశ్, ఆర్డీవో సంగీత్ మాధుర్, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, తహసీల్దార్ పాల్కిరణ్, జిల్లా పర్యాటకశాఖాధికారి కె.మాధవి, తదితరులున్నారు.