Share News

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:18 AM

జిల్లా కేంద్రం పాడేరుతో సహా పలు మండలాల్లో గత రెండు రోజులుగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒక వైపు జాతీయ రహదారి పనులు, మరో వైపు వడ్డాది నుంచి తాటిపర్తి రోడ్డు పనులు చేపడుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు తెగిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది చెబుతున్నారు. గత రెండు రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌, ఇంటర్నెట్‌ సేవలు సక్రమంగా అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం
సీలేరులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం

- పలు మండలాల్లో రెండు రోజులుగా అవస్థలు

- వినియోగదారులకు తప్పని ఇబ్బందులు

పాడేరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరుతో సహా పలు మండలాల్లో గత రెండు రోజులుగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒక వైపు జాతీయ రహదారి పనులు, మరో వైపు వడ్డాది నుంచి తాటిపర్తి రోడ్డు పనులు చేపడుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు తెగిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది చెబుతున్నారు. గత రెండు రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌, ఇంటర్నెట్‌ సేవలు సక్రమంగా అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనుల్లో భాగంగా తవ్వుతున్నప్పుడు రోడ్డుకు పక్కన గతంలో వేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు సైతం తవ్వేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు తెగిపోతున్నాయి. దీని వల్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో సెల్‌, ఇంటర్నెట్‌ సేవలు అందని దుస్థితి ఏర్పడింది. కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపై ఆధారపడే వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు పనులు చేయించే అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు సెలవు దినాల్లో ఎటువంటి సమస్యలు ఏర్పడినా బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది కనీసం స్పందించకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సీలేరులో సేవలు ఘోరం

సీలేరు: జీకేవీధి మండలంసీలేరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలు ఘోరంగా ఉన్నాయి. నెలలో పది రోజులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, జెన్‌కో కార్యాలయాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ కనెక్షన్లు ఉండడంతో అవి పని చేయక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. సీలేరులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ ఉన్నతాధికారులు స్పందించి అంతరాయం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:18 AM