పోర్టు ఉద్యోగులకుడిజిటల్ హెల్త్ కార్టులు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:29 AM
విశాఖపట్నం పోర్టులో ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగపడే విధంగా డిజిటల్ హెల్త్ కార్డు ప్రాజెక్టును యాజమాన్యం ప్రారంభించనుందని కేంద్ర పోర్టులు, నౌకాయాన, జల రవాణా శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
మరో రూ.168 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టులో ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగపడే విధంగా డిజిటల్ హెల్త్ కార్డు ప్రాజెక్టును యాజమాన్యం ప్రారంభించనుందని కేంద్ర పోర్టులు, నౌకాయాన, జల రవాణా శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. అక్కయ్యపాలెంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రూ.168 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్టు ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. ఆ తరువాత క్యుఆర్/ఆధార్ లింక్డ్ హెల్త్ కార్డులు అందిస్తారని, దాంతో వైద్య సేవల ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. పోర్టులో ఈస్ట్ క్వే-1 టెర్మినల్ను ఆపరేషన్, నిర్వహణ కోసం గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్కు అప్పగించినట్టు (రూ.130 కోట్లకు) వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో 120 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు హార్బన్ మొబైల్ క్రేన్లు వస్తాయని, దీనివల్ల 3 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యం పెరుగుతుందన్నారు. సుమారు 150 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్మార్ట్ వీడియో సర్వై లెన్స్ ప్రాజెక్టును రూ.37.53 కోట్లతో చేపడుతున్నారని, దీనివల్ల పోర్టులో భద్రత, పర్యవేక్షణ సామర్థ్యం పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, మరో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పోర్టు ఇన్చార్జి చైర్మన్ అంగముత్తు, సెక్రటరీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.