వైసీపీ ఎలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా ధర్మశ్రీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:26 AM
వైసీపీ ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియమితులయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అనకాపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియమితులయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఎలమంచిలి సమన్వయకర్తగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజును ఆ పదవి నుంచి తప్పించి కరణం ధర్మశ్రీని నియమించారు. అయితే కన్నబాబురాజుకు పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. కన్నబాబురాజు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి వయో భారంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన ఎలమంచిలి నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కన్నబాబురాజు పార్టీ అధ్యక్షుడితో తనకు వయోభారం పెరుగుతున్నందున కరణం ధర్మశ్రీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కోరినట్టు సమాచారం. ఎలమంచిలి సమన్వయకర్త పదవిని ఎలమంచిలి ఎంపీపీ బి.గోవింద్, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లు ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ధర్మశ్రీని సమన్వయకర్తగా నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.