20 నుంచి ధారాలమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:21 AM
జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నామని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు.

29న ప్రధాన పండుగ
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతుల కల్పనకు చర్యలు
ఆలయ ఈవో సాంబశివరావు
సీలేరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నామని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 8.39 గంటలకు ముహూర్తపు రాట వేసి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 29న ప్రధాన పండుగను నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.24 గంటలకు అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించిన అనంతరం గర్భగుడి తలుపులు మూసివేస్తామని, మరుసటి రోజు ఉదయం నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు అమ్మవారి సన్నిధిలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.