2 వేల హెక్టార్లలో పంట నష్టం
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:11 AM
2 వేల హెక్టార్లలో పంట నష్టం
100 హెక్టార్లుల్లో ఉద్యాన పంటలకు...
హోం మంత్రి అనిత
రజాల వద్ద శారదా నది గట్టు గండి పరిశీలన
శాశ్వత మరమ్మతులకు రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు
రాంబిల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ కారణంగా జిల్లాలో రెండు వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు, 100 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మండంలోని రజాల అగ్రహారం వద్ద శారదా నది గట్టుకు గండి పడిన ప్రదేశాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మేజర్ శారదా నది గట్టుకు గండి పడడం వల్ల సుమారు 400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నదిని ఆనుకొని ఆయిల్పామ్ తోటలో చిక్కుకున్న నలుగురిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారని చెప్పారు. సుమారు 35 వేల ఇసుక బస్తాలను సిద్ధం చేసి గండి పూడ్చివేత పనులు మొదలుపెట్టినట్టు వెల్లడించారు. శారదా నది గట్టుకు గండి పడిన ప్రదేశంలో శాశ్వత పనుల కోసం రూ.2.5 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. తుఫాన్ సమయంలో జిల్లాలో ఎక్కడా ప్రాణనష్టం వాటిల్లకుండా కలెక్టర్ విజయకృష్ణన్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారని అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ తుఫాన్ మొదలైన రోజు నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ, సహాయ పునరావాస కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. మంత్రితోపాటు ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. వీరి వెంట కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా, ఏసీఎస్ఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, కూటమి నాయకులు ధూళి రంగనాయకులు, లాలం భరత్, వి.దిన్బాబు, పప్పల నూకన్నదొర, తదితరులు వున్నారు.