స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడి మృతి
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:24 PM
స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో మంగళవారం ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉక్కుటౌన్షిప్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో మంగళవారం ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన పుచ్చల రామారావు (49) ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా ఆయనకు వాంతులు కావడంతో తక్షణమే ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు తరలించారు. అయితే అప్పటికే రామారావు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడనుంచి మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. కాగా కార్మికుడు మృతి చెందినప్పటికీ సంబంధిత కాంట్రాక్టరు పరామర్శించకపోవడం దారుణమని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.