Share News

ఐసీడీఎస్‌ సేవలపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:43 AM

జిల్లాలో ఐసీడీఎస్‌ సేవలపై కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్య సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో డేటా ఎంట్రీలో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా చూడాలన్నారు. అలాగే సమస్యాత్మక అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి ప్రతి నెలా సమాచారం అందించాలని ఆదేశించారు.

ఐసీడీఎస్‌ సేవలపై కలెక్టర్‌ అసంతృప్తి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి

- పనితీరు మార్చుకోకుంటే ఉపేక్షించనని హెచ్చరిక

పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐసీడీఎస్‌ సేవలపై కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్య సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో డేటా ఎంట్రీలో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా చూడాలన్నారు. అలాగే సమస్యాత్మక అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి ప్రతి నెలా సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ సేవలు మెరుగుపడేందుకు ఎంపీడీవోలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఐసీడీఎస్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్‌ హెచ్చరించారు. మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని, అనంతగిరిలో జరిగిన చిన్నారి మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డాక్టర్‌, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారి మృతి చెందడం బాధాకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియపై వైద్యుల పర్యవేక్షణ ఉండాలని, స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌ పేర్కొన్నారు. పీ4పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, టీడబ్ల్యూ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:43 AM