తాకట్టు బంగారంలో తరుగు!
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:56 AM
అనకాపల్లి జిల్లా చోడవరంలోని కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం వస్తువుల్లో చిన్న చిన్న ముక్కలను సిబ్బంది కత్తిరించుకుంటున్న వైనం బయటపడింది.
చోడవరం కనకమహాలక్షి ్మ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఘరానా మోసం
చిన్న చిన్న ముక్కలు తొలగింపు
లబోదిబోమంటున్న ఖాతాదారులు
చోడవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా చోడవరంలోని కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం వస్తువుల్లో చిన్న చిన్న ముక్కలను సిబ్బంది కత్తిరించుకుంటున్న వైనం బయటపడింది. పట్టణానికి చెందిన వెలుగుల దొరబాబు తన భార్యకు చెందిన 60 గ్రాముల బరువు గల రెండు బంగారు నెక్లె్సలను కనకమహాలక్ష్మి బ్యాంకులో తాకట్టు పెట్టారు. రెండు రోజుల క్రితం బ్యాంకు నుంచి విడిపించుకున్నారు. అయితే తాము తాకట్టుపెట్టిన వస్తువులలో ముక్కలు తొలగించి ఉంచడాన్ని గమనించి స్థానిక నాయకుడు జయదేవ్ సహకారంతో బ్యాంకు అధికారులను గట్టిగా నిలదీశారు. దీంతో తప్పిదాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు, రెండు వస్తువులలో తగ్గిన రెండు గ్రాముల బంగారం ఆయనకు గురువారం తిరిగి ఇచ్చారు. మాజీ ప్రజా ప్రతినిధి సోదరుడు తాకట్టు పెట్టిన వస్తువులో కూడా కొంతమేర తగ్గడంతో, అధికారులను నిలదీయగా తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది అంగీకరించారు. ప్రస్తుతానికి ఈ విధంగా ఎనిమిది మంది ఖాతాదారులు మోసపోయినట్టు తేలింది. ఇంకా బ్యాంకులో తాకట్టు పెట్టిన ఖాతాదారులు తమ బంగారాన్ని విడిపిస్తే, ఎవరెవరి వస్తువుల్లో ఎంత తగ్గిందో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బ్యాంకు అప్రైజర్ నిర్వాకమే
ఈ బ్యాంకులో బంగారం తనిఖీ చేసే అప్రైజర్ వెంకటేశ్, గతంలో పనిచేసిన బ్యాంకు అధికారి, కొందరు సిబ్బందితో కలిసి ఈ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే బ్యాంకు అప్రైజర్ చేసిన మోసం తెలిసినప్పటికీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండా, అతడిని ఇక్కడి నుంచి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. కొత్తగా వచ్చిన అప్రైజర్ కూడా అతడి సోదరుడేనని అంటున్నారు. తాకట్టుపెట్టుకున్న బంగారాన్ని ఇలా ముక్కలుగా కత్తిరించి మోసగించిన వ్యవ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నాకు ముందున్న వారి హయాంలో జరిగింది
కె.స్వామినాయుడు, బ్రాంచి మేనేజర్
బ్యాంకులో వెలుగుల దొరబాబు తాకట్టు పెట్టిన వస్తువుల్లో తగ్గిన బంగారం మేరకు ఆయనకు తిరిగి ఇచ్చాం. బ్యాంకులో తాము తాకట్టుపెట్టిన బంగారంలో తగ్గుదల వచ్చిందని ఇప్పటివరకూ ఎనిమిది మంది వరకూ ఫిర్యాదు చేశారు. వారందరి సమస్య పరిష్కారం అయింది. నేను ఇటీవల విధుల్లో చేరాను. నాకు ముందున్న వారి హయాంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్రైజర్ను ఇక్కడ నుంచి బదిలీ చేశారు.