శెట్టిపాలెంలో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం
ABN , Publish Date - May 03 , 2025 | 11:54 PM
మండలంలోని శెట్టిపాలేనికి కాఫీ పౌడర్ తయారీ కేంద్రం మంజూరైనట్టు ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. ఆ గ్రామంలో శనివారం ఆమె స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన శాఖ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం పనులు జరుగుతాయన్నారు. దీని వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
- స్థలాన్ని పరిశీలించిన జీసీసీ ఎండీ కల్పనాకుమారి
- ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడి
మాకవరపాలెం, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శెట్టిపాలేనికి కాఫీ పౌడర్ తయారీ కేంద్రం మంజూరైనట్టు ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. ఆ గ్రామంలో శనివారం ఆమె స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన శాఖ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం పనులు జరుగుతాయన్నారు. దీని వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అయితే శెట్టిపాలెంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి 12 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. ఈ భూమిలో ప్రస్తుతం జీడి, మామిడి తోటలు ఉన్నాయన్నారు. ఈ తోటలను తొలగించి ఇక్కడ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జాతీయ రహదారికి శెట్టిపాలెం దగ్గరగా ఉండడంతో ఈ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. దీని కోసం నలభై అడుగుల రోడ్డును కూడా పరిశీలించామన్నారు. మెయిన్ రోడ్డు నుంచి ఈ యూనిట్ స్థలానికి సుమారు రెండు కిలోమీటర్ల పొడవున రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ తయారు చేసే కాఫీ పొడిని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. తర్వలోనే పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో వీవీ రమణ, పాడేరు ఐటీడీఏ ఈఈ డేవిడ్రాజు, సర్పంచ్ అల్లు రామునాయుడు, గిరిజన శాఖ సిబ్బంది ఉన్నారు.