31న సీఎం పాడేరు రాక
ABN , Publish Date - May 21 , 2025 | 12:53 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు రానున్నారు.
పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు రానున్నారు. జూన్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోపైనా సీఎం ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
విశాఖ కోసం కుమారదేవంలో ఇసుక రీచ్
వర్షాకాలంలో కొరత రాకుండా అధికారుల ముందు జాగ్రత్త
నగరంలోని రెండు డిపోల్లో రెండు లక్షల టన్నుల మేర నిల్వ చేయాలని నిర్ణయం
శ్రీకాకుళం జిల్లాలోని రెండు రీచ్ల నుంచి మరో లక్ష టన్నులు
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
గత ఏడాది వర్షాకాలంలో ఇసుక కోసం నిర్మాణదారులు పడిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం ఈ సంవత్సరం అప్రమత్తమైంది. ఈ నాలుగు నెలలు...నగర అవసరాలకు సరిపడా ఇసుక నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఆమోదం తీసుకుంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి ఆనుకుని గోదావరి నదిలో రీచ్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ రీచ్ నుంచి రెండు లక్షల టన్నుల ఇసుకను విశాఖకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
కుమారదేవం ఇసుక రీచ్ను సోమవారం జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సందర్శించారు. నది గట్టు నుంచి రెండు కిలోమీటర్ల లోపల రీచ్ వరకూ రహదారి ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా గనుల శాఖ ఏడీ మజ్జి శ్రీనివాసరావు, గాజువాకలో ప్రైవేటు ఇసుక డిపో లీజుదారుడిని ఆదేశించారు. కుమారదేవం రీచ్ నుంచి మింది (గాజువాక), ముడసర్లోవల్లో గల ప్రైవేటు డిపోలకు ఇసుక తరలిస్తారు. ఇసుక తరలింపు పర్యవేక్షణకు గనుల శాఖ సిబ్బందిని రీచ్ వద్ద నియమించారు. రోజుకు 50 లారీలతో ఇసుక రవాణా ప్రారంభించి, 100 లారీలకు పెంచాలని నిర్ణయించారు.
ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే ప్రారంభం అవుతుందన్న వాతావరణ శాఖ అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధ్యమైనంత వరకు నది సమీపంలో ఖాళీ ప్రదేశం లీజుకు తీసుకుని అక్కడ నిల్వ చేయాలని భావిస్తున్నారు. ముందు నిల్వ చేసుకుని తరువాత గాజువాక,ముడసర్లోవకు రవాణా చేసుకునేలా నిర్ణయించారు. రీచ్ నుంచి గాజువాక 220 కి.మీ. దూరం ఉంది. కాగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులలో రీచ్ల నుంచి మరో లక్ష టన్నుల ఇసుక తరలించనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి భీమిలి, ముడసర్లోవ డిపోలకు ఇసుక తరలిస్తున్నారు. నదుల్లో నీటి ప్రవాహం పెరిగే సమయానికి భారీగా ఇసుక తవ్వి బయట నిల్వ చేయనున్నారు.
గత ఏడాది నగరంలోని మింది, ముడసర్లోవ, భీమిలిలో ప్రైవేటు వ్యక్తులకు ఇసుక డిపోలు కేటాయించారు. భీమిలి, ముడసర్లోవ డిపోల్లో టన్ను రూ.700, గాజువాకలో రూ.1000కు విక్ర యించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం నగరంలో టన్ను రూ.700కు దొరుకుతుండడంతో ప్రైవేటు డిపోల్లో ఆశించినంత అమ్మకాలు జరగడం లేదు. అయితే వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండనున్నందున తవ్వ కాలకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో నగర అవసరాల మేర ఇసుక అందుబాటులో ఉండేలా యంత్రాంగం చర్యలుతీసుకుంటోంది. వర్షాకాలంలో చిల్లర వ్యాపారుల వద్ద ఇసుక నిల్వలు ఉండవని, అప్పుడు ప్రభుత్వం కేటాయించిన ప్రైవేటు డిపోలలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
కోరమాండల్, మెయిల్ సహా పలు రైళ్లు రీ షెడ్యూల్
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
సాంకేతిక కారణాలతో కోరమాండల్, మెయిల్ ఎక్స్ప్రెస్ వంటి పలు స్థిర (ఒరిజినేటింగ్) రైళ్లను రీ షెడ్యూల్ చేయడంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-షాలిమార్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ (12842) సాయంత్రం 5.15 గంటలకు, ఉదయం 10.35 గంటలకు బయలుదేరాల్సిన బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్ (12864) బుధవారం ఉదయం 4 గంటలకు, మంగళవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన జగదల్పూర్-హౌరా సమలేశ్వర్ ఎక్స్ప్రెస్ (18006) మధ్యాహ్నం 2 గంటలకు, మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరాల్సిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ (12841) బుధవారం వేకువజామున 00.30 (మంగళవారం అర్ధరాత్రి 12.30) గంటలకు, మంగళవారం సాయంత్రం 5.55 గంటలకు బయలుదేరాల్సిన సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్ ఏసీ ఎక్స్ప్రెస్ (22807) బుధవారం వేకువజామున 00.30 (మంగళవారం అర్ధరాత్రి 12.30) గంటలకు, మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరాల్సిన షాలిమార్-విశాఖ ఎక్స్ప్రెస్ (22853) బుధవారం వేకువజామున 2.45 గంటలకు, మంగళవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ (12840) బుధవారం ఉదయం 11 గంటలకు బయలుదేరేలా రీ షెడ్యూల్ చేశామని రైల్వే అధికారులు తెలిపారు.