సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష రేపు
ABN , Publish Date - May 24 , 2025 | 01:21 AM
ఈనెల 25వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
నగరంలో 8,424 మంది అభ్యర్థులు
19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు
అభ్యర్థులు అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి
ఎటువంటి ఎలకా్ట్రనిక్ పరికరాలు తీసుకువెళ్లకూడదు
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 25వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. మొత్తం 19 కేంద్రాల్లో 8,424 మంది పరీక్షకు హాజరవుతారన్నారు. ప్రతి కేంద్రంలో అభ్యర్థులకు తాగునీరు తదితర వసతులు కల్పించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటుచేయాలని భెల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఏమరుపాటు పనికిరాదని హెచ్చరించారు. పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ (0891-2590100, 0891-2590102) ఏర్పాటుచేశామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సందేహాలుంటే కంట్రోల్రూమ్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని, ఎటువంటి ఎలకా్ట్రనిక్ పరికరాలు తీసుకు రాకూడదని కలెక్టర్ స్పష్టంచేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఐడీ కార్డు తీసుకురావాలని, ఒకవేళ కార్డు తీసుకురాకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీశంకర్, యూపీఎస్సీ డైరెక్టర్ పట్నాయక్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉండండి
డీలర్లకు డీఎస్వో సూచన
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుదారులకు సరకులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని రేషన్ డీలర్లకు జిల్లా పౌరసరఫరాల శాఖాఽధికారి కె.భాస్కర్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. సరకుల పంపిణీకి సంబంధించి రికార్డులు, తూకం యంత్రాలు, ఈపోస్ మిషన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్డుదారులకు ఇబ్బందులు ---లేకుండా వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలన్నారు.
ఇంటి సర్వే
తక్కువ పన్ను చెల్లిస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం
వైసీపీ హయాంలో జరిగిన తప్పులు సవరించాలని నిర్ణయం
అక్రమ నిర్మాణాలకు 25 నుంచి 100 శాతం అదనంగా పన్ను విధింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ఇళ్ల కొలతల తీసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించుకొని తక్కువ పన్నులు కడుతున్న వారిని గుర్తించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన నాయకులు, కేడర్ ఆస్తిపన్నుల విషయంలో అనేక జిమ్మిక్కులు చేశారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా స్పందించలేదు. ఇప్పటికే ఆ తక్కువ పన్నులే కొనసాగుతున్నాయి. అదేవిధంగా మరికొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని లోబరుచుకొని ఇంటి పన్ను తక్కువ వచ్చేలా మేనేజ్ చేసుకున్నారు. దీనివల్ల ఆశించిన మేర ఆదాయం రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. జూన్ 15వ తేదీలోపు సర్వే పూర్తిచేసి ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన వాటిపై అతిక్రమణను బట్టి జరిమానాలు వేయాలని సూచించింది.
- ఇంటిని ప్లాన్ ప్రకారం కట్టకుండా 10 శాతం ఉల్లంఘన జరిగితే 25 శాతం అదనంగా ఆస్తిపన్ను వేస్తారు.
- ప్లాన్ని ఉల్లంఘించి 10 శాతం కంటే ఎక్కువ నిర్మాణం జరిగితే 50 శాతం పన్ను పెంచుతారు.
- ప్లాన్ లేకుండా నిర్మాణం చేపట్టినా, ప్లాన్ లేకుండా అదనపు అంతస్థు వేసినా 100 శాతం ఆస్తి పన్ను పెంచుతారు.
- ఎవరైనా ఇంటి ముందు దుకాణం పెట్టుకున్నా, ఆఫీసుకు అద్దెకు ఇచ్చినా దానిని వాణిజ్య భవనంగా పేర్కొంటూ ఆస్తి పన్ను రెండున్నర రెట్లు పెంచుతారు.
సక్రమంగా కడుతున్నవారికి ఇబ్బంది లేదు
ఇంటి విస్తీర్ణం ప్రకారం పన్నులు కడుతున్న వారిపై కొత్తగా పడే భారం ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. నిర్మాణాన్ని బట్టి పన్ను, నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానాలు విధించేందుకు మాత్రమే సర్వే చేపట్టినట్టు చెబుతున్నారు.
కౌన్సిల్లో చర్చించాలి
బి.గంగారావు, కార్పొరేటర్, సీపీఎం ఫ్లోర్ లీడర్
ఏపీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పెంపు లేదా జరిమానా విధించే అధికారం జీవీఎంసీ కౌన్సిల్కే ఉంటుంది. రీసర్వేపై కౌన్సిల్లో చర్చించలేదు. వెంటనే సర్వే ఆపాలి.