మిన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:05 AM
గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి, గూగుల్ కంపెనీకి మధ్య చారిత్రక ఒప్పందం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. గూగుల్ డేటా సెంటర్కు వెల్కమ్ చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లకు ధన్యవాదాలు తెలిపారు.
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై ఆనందోత్సాహాలు
బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంపిణీ
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లకు అభినందనలు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి, గూగుల్ కంపెనీకి మధ్య చారిత్రక ఒప్పందం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. గూగుల్ డేటా సెంటర్కు వెల్కమ్ చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లకు ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన వేడుకల్లో పీలా గోవింద మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకే్శ్ కృషితో విశాఖనగరానికి రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా రానుండడం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసినట్టేనని అన్నారు. జగన్రెడ్డి ఎన్ని అడ్డంకులు పెట్టినా విశాఖకు ఐటీ కంపెనీలు రావడం ఖాయమని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 12 నెలలపాటు శ్రమించి, నేషనల్ పాలసీల్లో మార్పులు చేయించి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటుకు చంద్రబాబునాయుడు చేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు. నాలుగేళ్లలో విశాఖపట్నం ప్రపంచ ఐటీ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాలూ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేశ్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ, టీడీపీ నేతలు మాదంశెట్టి నీలబాబు, కర్రి బాబి, పోలారపు త్రినాథ్, బొడ్డేడ మురళీ, భానుచందర్, పిట్ల రాజు, పైలా గోపి, బొడ్డేడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. విశాఖకు భారీ ప్రాజెక్టు తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారంటూ మంత్రి నారా లోకేశ్కి కృతజ్ఞతలు తెలిపారు. పాయకరావుపేటలో టీడీపీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. విశాఖలో డేటా సెంటర్లు, నక్కపల్లి మండలంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు, ఇతర కంపెనీలు, పరిశ్రమల రాకతో ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు ఐదు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. చోడవరం పట్టణంలోని కొత్తూరు జంక్షన్లో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బాణసంచా కాల్చి సందడి చేశారు.
మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలోని రైవాడ అతిఽథిగృహం ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరిపి మిఠాయిలు పంచారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్తోపాటు ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అచ్యుతాపురం జంక్షన్లో సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు మరువలేనిదని ప్రగడ అన్నారు. రాంబిల్లి మండలంలో దీని శాఖను ఏర్పాటు చేయనుండడం ఈ ప్రాంతీయులకు వరమని అన్నారు.