మినీవ్యాన్ ఢీకొని బాలుడి మృతి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:49 AM
దసరా సెలవుల్లో తాత, నానమ్మల వద్ద సరదాగా గడపడానికి వచ్చిన బాలుడిని వ్యాన్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. మాడుగులలోని జగ్గన్నచావిడి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.
దసరా సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చి తిరిగిరాని లోకాలకు..
మాడుగుల రూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవుల్లో తాత, నానమ్మల వద్ద సరదాగా గడపడానికి వచ్చిన బాలుడిని వ్యాన్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. మాడుగులలోని జగ్గన్నచావిడి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.
మాడుగుల గ్రామానికి చెందిన గుంపాన అచ్యుతరావు ఉపాధి నిమిత్తం విశాఖ నగరంలోని నరవ ప్రాంతానికి వలస వెళ్లి, భార్య పిల్లలతో నివాసం వుంటున్నాడు. అచ్యుతరావు చిన్న కుమారుడు జయంత్(6) రెండో తరగతి చదువుతున్నాడు. దసరా పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో జయంత్ బుధవారం విశాఖ నుంచి మాడుగులలోని జగ్గన్నచావిడి వీధిలో నివాసం వుంటున్న తాత అప్పారావు (అచ్యుతరావు తండ్రి) ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం పది గ ంటల సమయంలో ఆడుకునేందుకు జయంత్ వీధిలో నుంచి రోడ్డుపైకి వస్తున్న క్రమంలో మినీవ్యాన్ ఢీకొన్నది. జయంత్ రోడ్డుపై తుళ్లి పడిపోవడంతో తలవెనుక బాగంలో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు చికత్స నిమిత్తం స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. జయంత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన మాడుగుల చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు.