జోరుగా బొర్రా గుహల అభివృద్ధి పనులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:15 AM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి 2024 మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నుంచి వర్చువల్ విధానంలో పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతగిరి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి 2024 మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నుంచి వర్చువల్ విధానంలో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రూ.24.09 కోట్లతో గుహలు వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పర్యాటకశాఖ ప్రణాళికలను రూపొందించి, టెండర్లకు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. గత సెప్టెంబరులో, అలాగే ఈ ఏడాది మార్చి నెలలో మరోసారి టెండర్ ఆహ్వానించారు. ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముఖద్వారాన్ని ఆనుకుని ఉన్న టికెట్ కౌంటర్ కొంతభాగాన్ని తొలగించారు. అభివృద్ధి నిధులతో అందమైన స్వాగత ద్వారం, క్యాష్లెస్ టికెట్ విధానం, రెస్టారెంట్, మరుగుదొడ్లు, పాత్వేలు, వ్యూపాయింట్లు, గుహల లోపల సహజసిద్ధంగా ఏర్పడిన అందాలను మరింత అందంగా చూపించేలా చర్యలు చేపట్టనున్నారు.