డీడీవో వ్యవస్థతో మెరుగైన పాలన
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:02 AM
డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చ్వల్గా గురువారం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీడీవో వ్యవస్థ ద్వారా జిల్లాలో పంచాయతీరాజ్, డ్వామా భాగస్వామ్యంతో ప్రజలకు సేవలందిస్తారన్నారు.
కలెక్టర్ దినేశ్కుమార్
వర్చువల్గా డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
పాడేరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చ్వల్గా గురువారం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీడీవో వ్యవస్థ ద్వారా జిల్లాలో పంచాయతీరాజ్, డ్వామా భాగస్వామ్యంతో ప్రజలకు సేవలందిస్తారన్నారు. అలాగే ప్రతి పంచాయతీ స్వయంప్రతిపత్తి కలిగేలా దోహద పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేసేందుకు డీడీవో వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా సంస్కరణల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీడీవో వ్యవస్థతో వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో రిబ్బన్ కట్ చేసి డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నిర్వహించిన వర్చ్వల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీడీవో జయప్రకాశ్, డీపీవో చంద్రశేఖర్, డ్వామా పీడీ విద్యాసాగర్, డీఎల్పీవో పీఎస్ కుమార్, జడ్పీటీసీ సభ్యురాలు కె.గాయత్రి, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, పీఏపీఎస్ పర్సన్ ఇన్చార్జి డప్పోడి వెంకటరమణ, సర్పంచులు కె.ఉషారాణి, ఎల్.పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.