హాస్టళ్లలో ఉత్తమ బోధన
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:21 PM
హాస్టళ్లలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, విలువలతో కూడిన బోధన చేసి ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సూచించారు. శనివార జడ్పీ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమశాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు జరిగింది.
విద్యార్థులను ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దేందుకు చర్యలు
పనితీరు ఆధారంగా వసతిగృహాలకు ర్యాంకులు
బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ
విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్లలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, విలువలతో కూడిన బోధన చేసి ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సూచించారు. శనివార జడ్పీ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమశాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్ల సదస్సు జరిగింది. ఈ సదస్సును జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ పురాతన చరిత్రలు చూస్తే గురుకులాల్లో చదువు, క్రమశిక్షణ, అనేక విషయాలనే బోధించి వారికి సమాజంలో మంచి పౌరులుగా తయారుచేశారని గుర్తుచేశారు. అలాంటి విద్యను హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు అందించినప్పుడే మంచి సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడం, రుచికరమైన భోజనాన్ని అందించడం, ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హాస్టళ్ల వార్డెన్లు విధిగా తాము పనిచేసే చోట నివాసం ఉఏండాలని స్పష్టం చేశారు. ప్రతిభ, పనితీరు, నిర్వహణ, పరీక్ష ఫలితాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని హాస్టళ్లు, గురుకులాలకు ర్యాంకులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ తాను విజయనగరం జిల్లా జొన్నలవలస బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నానన్నారు. అంకిత భావంతో హాస్టళ్లను నిర్వహిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ ఉన్నతమైన విలువలను పాటిస్తూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే సత్తా వార్డెన్లకు ఉంటుందన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ఇన్చార్జి విశాఖ బీసీ వెల్ఫేర్ అధికారి కె.రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ రాష్ట్ర డైరెక్టర్ డి.చంద్రశేఖర్, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల డైరెక్టర్ పి. మాధవీలత, జేడీ చినబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ వెల్ఫేర్ అధికారులు శ్రీదేవి, జ్యోతిశ్రీ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.