అతివలకు అందలం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:28 AM
అతివల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళలను ప్రోత్సహించి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి చేయూతనిస్తున్నది. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సభ్యురాలికి తృప్తి క్యాంటీన్లు మంజూరు చేశారు. క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆసక్తి కనబరిచిన సభ్యురాలికి రూ.13 లక్షలు బ్యాంక్ రుణం మంజూరు చేయిస్తున్నారు.
- ఎస్హెచ్జీ సభ్యురాలికి తృప్తి క్యాంటీన్ మంజూరు
- రూ.13 లక్షలు బ్యాంక్ రుణం మంజూరు
- రాష్ట్ర దత్తత వనరుల సంస్థతో ఎంఓయూ
- కంటైనర్, స్టవ్, వంట సామగ్రి, సౌర విద్యుత్ ఏర్పాట్లు
- ఇటీవల ఎస్హెచ్జీ సభ్యురాలితో డీజీ లక్ష్మి సీఎస్సీ ప్రారంభం
- మహిళాభివృద్ధి ప్రభుత్వం చర్యలు
నర్సీపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అతివల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళలను ప్రోత్సహించి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి చేయూతనిస్తున్నది. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సభ్యురాలికి తృప్తి క్యాంటీన్లు మంజూరు చేశారు. క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆసక్తి కనబరిచిన సభ్యురాలికి రూ.13 లక్షలు బ్యాంక్ రుణం మంజూరు చేయిస్తున్నారు. రాష్ట్ర దత్తత వనరుల సంస్థ (స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ)తో ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాతో తృప్తి క్యాంటీన్లు తయారు చేస్తున్నారు. క్యాంటీన్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు సదరు సంస్థ చేస్తుంది. క్యాంటీన్ కోసం కంటైనర్, వంట సామగ్రి, గ్యాస్ స్టవ్, ఫర్నిచర్, సౌర విద్యుత్ సదుపాయం సమకూర్చుతుంది. ఎస్హెచ్జీ సభ్యురాలికి మంజూరైన రూ.13 లక్షల బ్యాంక్ రుణంతో ఇవన్నీ సమకూర్చుతారు. మునిసిపాలిటీ పరిధిలో క్యాంటీన్కి అనుకూలమైన స్థలం చూపిస్తే, పాలకవర్గం తీర్మానం తీసుకొని కమిషనర్ అనుమతులు ఇస్తారు. పెదబొడ్డేపల్లిలో నివాసం ఉంటున్న ఎస్హెచ్జీ సభ్యురాలు షేక్ భానుకుమారికి తృప్తి క్యాంటీన్ మంజూరు చేశారు. ఆమెకు బ్యాంక్ రుణం మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రహారీ గోడను అనుకొని క్యాంటీన్ పెట్టాలని ప్రతిపాదించారు. త్వరలో క్యాంటీన్ ప్రారంభించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ ఎన్.సరోజిని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ మునిసిపాలిటీకి ఒకటి చొప్పున జిల్లాకి రెండు తృప్తి క్యాంటీన్లు మంజూరయ్యాయని తెలిపారు.
అందుబాటులో డీజీ లక్ష్మి సీఎస్సీ సేవలు
ఎస్హెచ్జీ గ్రూపులో డిగ్రీ చదువుకున్న సభ్యురాలిని డీజీ లక్ష్మిలుగా ఎంపిక చేసి మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఇటీవల మునిసిపాలిటీ పరిధిలోని జోగినాథునిపాలెంలో ఎస్హెచ్జీ సభ్యురాలు పైలా వెంకటక్ష్మితో కామన్ సర్వీస్ సెంటర్ పెట్టించారు. సోమవారం ఈ సెంటర్ను చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఇక్కడ మీ-సేవ తరహా అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సెర్ప్ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సభ్యురాలు రెల్ల లోవదేవీతో శారదాగనర్ మెయిన్ రోడ్డు చివర టీ జంక్షన్లో అరకు నేటీవ్ కాఫీ స్టాల్ పెట్టించారు. దీని కోసం లబ్ధిదారుకి పీఎంఎఫ్ఎంఈ ద్వారా రూ.4లక్షలు, ఉన్నతి పథకంలో రూ.లక్ష, డ్వాక్రా సంఘం అంతర్గత రుణం రూ.50 వేలు మంజూరు చేశారు. అరకు కాఫీ స్టాల్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ప్రతీ కుటుంబం నుంచి మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలని గ్రామీణంలో సెర్ప్, పట్టణ ప్రాంతంలో మెప్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.