బంతి పూల ధర పతనం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:31 AM
మన్యంలో బంతి పూలకు గిరాకీ తగ్గింది. వాటిని కొనుగోలు చేసేవారే కరువయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పది కిలోలుండే బుట్ట పూలు కేవలం రూ.50లకు విక్రయించాల్సి వస్తోంది.
గతంలో బుట్ట పూలు రూ.200 నుంచి రూ.250
ప్రస్తుతం కేవలం రూ.50కే విక్రయం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో బంతి పూలకు గిరాకీ తగ్గింది. వాటిని కొనుగోలు చేసేవారే కరువయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పది కిలోలుండే బుట్ట పూలు కేవలం రూ.50లకు విక్రయించాల్సి వస్తోంది. గతంలో పది కిలోల పూల బుట్ట రూ.200 నుంచి రూ.250లకు గిరిజన రైతుల నుంచి వర్తకులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఏజెన్సీలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లో అధిక విస్తీర్ణంలో గిరిజన రైతులు బంతి పూల సాగు చేపడుతున్నారు. మూడు మండలాల్లోని బంతి పూలను పాడేరులో ప్రతి రోజు జరిగే ‘బంతి పూల మార్కెట్’లో క్రయవిక్రయాలు జరుపుతుంటాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు ప్రాంతాలకు చెందిన వర్తకులు ఇక్కడికి వచ్చి వాటిని కొనుగోలు చేసి, బస్తాల్లో ప్యాక్ చేసి ఆయా ప్రాంతాలకు వాహనాల్లో రవాణా చేస్తుంటారు.
ఘోరంగా పతనమైన ధర
ప్రస్తుతం బంతి పూల ధర ఘోరంగా పతనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం పాడేరు మార్కెట్లో బుట్ట పూలు రూ.50లకు మించి అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. అలాగే కొనుగోలుదారుల కోసం గిరిజనులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దసరా ఉత్సవాలు, భవానీ, అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులున్న సమయాల్లో బంతి పూలకు మంచి డిమాండ్ ఉండేదని, ప్రస్తుతం ఆ సీజన్ ముగియడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వర్తకులు కొనుగోలు చేసేందుకు రాకపోవడంతో డిమాండ్ లేకుండా పోయిందని తెలిపారు. అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వర్తకులు వస్తే ధర రెట్టింపుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ తాజా పరిస్థితుల్లో వాళ్లు రారనే సంకేతాలున్నాయని రైతులు అంటున్నారు.
మన్యం బంతి వెరీ స్పెషల్
ఏజెన్సీలో సహజసిద్ధంగా సాగు చేసే బంతి పూలకు ఇతర ప్రాంతాల్లో చాలా ఢిమాండ్ ఉంది. ఎందుకంటే, ఇతర ప్రాంతాల్లో పూలు కోసిన రెండు, మూడు రోజుల్లో వాడిపోతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు చేసిన పువ్వులను ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు సకాలంలో రవాణా చేయకపోతే వర్తకులు నష్టపోయే అవకాశముంది. అదే ఏజెన్సీలోని పువ్వులైతే కోసిన వారం రోజులకు గాని వాడిపోవు. అందువలన ఇక్కడ కొనుగోలు చేసిన పువ్వులను ఎక్కడికైనా ఎటువంటి భయం లేకుండా రవాణా చేసుకోవచ్చుననే ఽధీమాతో వర్తకులు వాటి కొనుగోలుకు ఎగబడుతుంటారు. అయితే ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడడంతో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.