వినియోగదారుల్లో చైతన్యం అవసరం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:38 AM
వినియోగదారుల్లో చైతన్యం ఉండాలని, మోసం జరిగితే ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్ సూచించారు.
మోసాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు
చికెన్, మటన్ విక్రయాల్లో తేడాలపై స్పందన
పెట్రోల్ బంకుల్లో ఐదు లీటర్ల క్యాన్లతో చెక్ చేసుకునే వీలు
ప్యాకేజీ నిబంధనలు పాటించకపోతే జరిమానా
అధికారులు తనిఖీ చేసి ఇచ్చిన మెషీన్లు, తూకపు రాళ్లనే వినియోగించాలి
తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
వినియోగదారుల్లో చైతన్యం ఉండాలని, మోసం జరిగితే ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్ సూచించారు. చికెన్, మటన్ విక్రయాల్లో మోసాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైనా ప్యాకేజీ నిబంధనలుండాలని, మోసాలపై ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ కె.థామస్ రవికుమార్ పేర్కొన్నారు. ఈ శాఖ పరిధిలో కార్యకలాపాలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విధానంపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
తూనికలు, కొలతలశాఖ రెండురకాల కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మొదటిది ప్రమాణాలను సరిచేయడం. ఇందుకోసం వ్యాపారం చేసే వారి తూనికలు, కొలతల సామగ్రిని తనిఖీ చేయడం. రెండోది ఎన్ఫోర్స్మెంట్. నిబంధనలను పాటిస్తున్నారా.? లేదా.? తనిఖీ చేసి, మోసం చేసేవారిపై చర్యలు తీసుకుంటాం. చిన్నపాటి కూరగాయల దుకాణం నుంచి పరిశ్రమల వరకు తూనికలు, కొలతల కార్యకలాపాలను పర్యవేక్షిస్తాం. యజమానులు తప్పనిసరిగా రెండేళ్లకు ఒకసారి నిబంధనలకు అనుగుణంగా కాటాలు, మెషీన్లు తనిఖీ చేయించుకుని ధ్రువపత్రం తీసుకోవాలి. ఈ ధ్రువపత్రం లేని వాటిని వినియోగిస్తే ఫిర్యాదు చేయాలి.
నగరంలో చికెన్, మటన్ విక్రయాల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయ ని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ శాఖ ముద్ర వేసి ఇచ్చిన పరికరాలను వినియోగించడం లేదు. వారిపై చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో విక్రయించే కొన్నిరకాల వస్తువులపై ప్యాకేజీ నిబంధనలు లేవనే ఫిర్యాదులున్నాయి. మాల్స్లోని ర్యాక్స్లో సరకులు మార్చకుండా పాత ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. థియేటర్స్లో తినుబండారాలకు అధిక ధరలు వసూలుచేస్తున్నారని, రైల్వేస్టేషన్, బస్టాండ్స్లో ఆహార ఉత్పత్తులను ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల రైల్వేస్టేషన్, బస్టాండ్స్లో తనిఖీలు చేపట్టి దుకాణదారులకు జరిమానా వేశాం.
కూరగాయల నుంచి బంగారం వరకు కొనుగోలు చేసే ప్రతి వస్తువు బరువు లో తేడా ఉన్నా, పెట్రోల్ బంకుల్లో మోసం జరిగినట్టు అనుమానమున్నా ఫిర్యాదు చేయవచ్చు. తూనికలు శాఖ అధికారులు ముద్రణతో ఇచ్చిన పరిక రాలు వినియోగించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి లో టోల్ఫ్రీ నంబరు 1967 ఉంది. జిల్లాస్థాయిలో 0891 2799551 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని గంటల్లోనే చర్యలు తీసుకుని అప్డేట్ సమాచారాన్ని అందిస్తాం.
ప్రతి ఫిర్యాదుపైనా చర్యలుంటాయి. ఫిర్యాదు చేసే వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఎవరూ ప్రశ్నించకపోతే మోసాలు పెరుగుతాయి. ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకుంటే మిగిలిన వారికి భయం వస్తుంది.
ప్యాకేజీ నిబంధనలపై వినియోగదారులకు అవగాహన ఉండాలి. ప్రతి ప్యాకింగ్ వస్తువుపై తప్పనిసరిగా కొన్ని వివరాలు ఉండాలి. అవి లేకపోయినా, తప్పుడు సమాచారం ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు. వస్తువు తయారుచేసిన సంస్థ, ప్యాకెట్లో ఉన్న ఐటెమ్, బరువు, గడువు, ధర వంటి వివరాలు ఉండాలి. ఇందులో ఏ సమాచారం లేకపోయినా, అదనపు ధర వసూలు చేసినా శిక్షార్హులు. కొత్తగా యూనిట్ సేల్ ధరను కూడా మెన్షన్ చేయాలన్న నిబంధన వచ్చింది. అంటే ఒక గ్రాము ధర ఎంత పడుతుందన్న సమాచారం తప్పనిసరిగా ముద్రించాలి.
గత ఏడాది ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,519 మంది కేసులు నమోదు చేశాం. ఇందులో తూనికలకు సంబంధించిన మోసాలు 1422 ఉన్నాయి. ప్యాకేజీ నిబంధనలు అమలు చేయని వారిపై 1097 కేసులున్నాయి. వాటి ద్వారా రాజీకి వసూలుచేసిన మొత్తం రూ.1.64.67,700. ముద్రణ ఫీజు కింద రూ.3,23,72,700 వసూలు చేశాం.
శాఖ పరిధిలో తగిన సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ కంట్రోలర్, విశాఖ జిల్లాలో నలుగురు అసిస్టెంట్ కంట్రోలర్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు పూర్తిగా హెచ్పీసీఎల్, ఐవోసీ, బీపీసీ కంపెనీల్లోని ట్యాంకులను పరిశీలిస్తారు. మిగిలిన ఇద్దరూ నగర పరిధిలో సేవలందిస్తారు. మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లున్నారు. అనకాపల్లి జిల్లాకు ఒక అసిస్టెంట్ కంట్రోలర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరిలో నర్సీపట్నం కేంద్రంగా పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ అల్లూరి జిల్లా బాధ్యతలను చూస్తారు. అల్లూరి జిల్లాకు ఒక అసిస్టెంట్ కంట్రోలర్ ఉన్నారు.
పెట్రోలు బంకుల్లో మోసాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ మోసాలు డిఫరెంట్గా ఉంటాయి. పెట్రోల్ పోయించుకునే ముందు జీరో ఉన్నదీ.? లేనిదీ చూడాలి. ఆశించిన స్థాయిలో ఫిల్ చేయలేదనిపిస్తే అక్కడే ఉన్న ఐదు లీటర్ల ట్యాంకులో ఫిల్ చేయమని కోరాలి. ప్రతి పెట్రోల్ బంకులో ఈ తరహా ట్యాంకు ఉండాలి. ట్యాంకు లేదన్నా, పెట్రోలు అందులో పోయను అన్నా ఫిర్యాదు చేయవచ్చు. వారిపై చర్యలు తీసుకుంటాం.