కుంకుంపూడి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలకు యత్నం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:37 AM
మండలంలోని కుంకుంపూడి రంగురాళ్ల క్వారీలో వ్యాపారులు తవ్వకాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు భూమి యజమాని అయిన మాజీ మావోయిస్టు హరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కుంకుంపూడిలో గతంలో రంగురాళ్ల తవ్వకాలు జరిగాయి.
అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
గూడెంకొత్తవీధి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంకుంపూడి రంగురాళ్ల క్వారీలో వ్యాపారులు తవ్వకాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు భూమి యజమాని అయిన మాజీ మావోయిస్టు హరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కుంకుంపూడిలో గతంలో రంగురాళ్ల తవ్వకాలు జరిగాయి. అటవీశాఖ అధికారులు ఈ రంగురాళ్ల క్వారీని మూసివేశారు. తాజాగా వర్షాలు కురుస్తుండడంతో చింతపల్లి, నర్సీపట్నానికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా ఎక్స్కవేటర్తో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం హుటాహుటిన కుంకుంపూడి గ్రామానికి వెళ్లారు. తవ్వకాల కోసం ప్రయత్నించిన ప్రాంతాన్ని పరిశీలించారు. రంగురాళ్ల తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన గొయ్యిని అటవీశాఖ అధికారులు పూడ్చివేశారు. క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తవ్వకాల వెనుక వున్న వ్యాపారులపై విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. క్వారీలో తవ్వకాలను కట్టడి చేసేందుకు బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో మహేశ్గిరి, ఎఫ్బీవో మండి భూషణం, వీరభద్రం పాల్గొన్నారు.