ఆటో డ్రైవర్లకు భరోసా
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:25 AM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకువచ్చింది.
ప్రతి ఒక్కరికీ రూ.15 వేల ఆర్థిక సాయం
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
19వ తేదీ వరకే గడువు
22వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలన
24న అర్హుల జాబితా విడుదల
దసరా పండుగనాడు డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకువచ్చింది. అర్హులైన ఆటో కార్మికులకు రూ.15 వేల చొప్పున దసరా పండుగ రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్ర్తీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆటోలను ఆశ్రయించే ప్రయాణికులు తగ్గిపోయి, ఆదాయాన్ని కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్- సూపర్హిట్’ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రవాణా శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 40 వేల ఆటోలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పేరుతో ఏటా రూ.10 వేలు మాత్రమే అందించింది. కూటమి ప్రభుత్వం మరో 50 శాతం అధికంగా..అంటే రూ.15 వేల చొప్పున చెల్లించనున్నట్టు ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికపై రవాణా శాఖ అధికారులకు విధి విధానాలను జారీ చేసింది.
ఎవరు అర్హులు?
ఆటోరిక్షా, మోటారు క్యాబ్, మ్యాక్సీక్యాబ్ను సొంతంగా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్ కార్డు, బియ్యం రేషన్ కార్డు ఉండాలి. ఏపీ రవాణా శాఖ జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం రిజిసే్ట్రషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్, ట్యాక్స్ వంటివి చెల్లుబాటు అయ్యే రికార్డులు ఉండాలి. ఆటోలకు ఒక నెలలోపు తీసుకున్న ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రయాణికులను చేరవేసే వాహనాలు నడిపేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సరకు రవాణా వాహనాలు నడిపేవారు ఈ పథకానికి అర్హులు కారు. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ఇతర వృత్తి సంబంధిత ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు అయితే.. ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. దరఖాస్తుదారుల కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉద్యోగ విరమణ చేసినవారు ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు వెసులుబాటు కల్పించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, నెలకు 300 యూనిట్లకంటే ఎక్కువ (12 నెలల సగటు) విద్యుత్ వినియోగించేవారు, పల్లం భూమి మూడు ఎకరాలు, మెట్ట పది ఎకరాలకు మించి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులవుతారు. పట్టణ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస భవనం వున్నవారు, లీజు/ అద్దెకు తీసుకుని వాహనాలు, ఆర్టీఓ చలానాలు బాకీ ఉన్న వాహనాలు ఈ పథకం కిందకు రావు.
దరఖాస్తుకు మూడు రోజులే గడువు
అర్హులైన ఆటో రిక్షా, మోటారు క్యాబ్, మ్యాక్సీక్యాబ్ల డ్రైవర్లు బుధవారం నుంచి జీఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీ వరకే గడువు ఉంది. అందిన దరఖాస్తులపై గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది 22వ తేదీన క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఎంపీడీఓలు/జీవీఎంసీ జోనల్ కమిషనర్లు తుది జాబితాలను కలెక్టర్కు పంపారు. అర్హుల జాబితాను ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన వారికి దసరా పండుగ రోజున బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది.