Share News

తవ్వుతున్న కొద్దీ...

ABN , Publish Date - May 26 , 2025 | 12:42 AM

అచ్యుతాపురం సైబర్‌ మోసాలకు పాల్పడుతూ, పోలీసుల దాడి నుంచి తప్పించుకుని పారిపోయిన వ్యక్తులు, వారి కుటుంబీకులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు వార్తలు రావడంతో ఇక్కడ సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన వారు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా గెస్ట్‌హౌస్‌, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు ఇప్పించిన వారు, సైబర్‌ నేరగాళ్లు ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసినప్పుడు ష్యూరిటీ సంతకాలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తవ్వుతున్న కొద్దీ...
సైబర్‌ నేరస్థులు అద్దెకు తీసుకున్న అవెన్యూ

అచ్యుతాపురాన్ని వీడని సైబర్‌ నేరాల ముఠా?

పోలీసుల దాడి నుంచి పరారైన వ్యక్తులు ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు స్థానికుల అనుమానం

సైబర్‌ నేరాల ముఠాకు సంబంధించి వెలుగులోకి కొత్త విషయాలు

వ్యాపారం పేరుతో అద్దెకు అతిథిగృహం, అపార్ట్‌మెంట్లు

సహకరించిన స్థానిక నాయకులు

కేసును సీఐడీకి అప్పగించడంతో నేతల్లో గుబులు

అచ్యుతాపురం, మే 25 (ఆంధ్రజ్యోతి):

అచ్యుతాపురం సైబర్‌ మోసాలకు పాల్పడుతూ, పోలీసుల దాడి నుంచి తప్పించుకుని పారిపోయిన వ్యక్తులు, వారి కుటుంబీకులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు వార్తలు రావడంతో ఇక్కడ సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన వారు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా గెస్ట్‌హౌస్‌, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు ఇప్పించిన వారు, సైబర్‌ నేరగాళ్లు ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసినప్పుడు ష్యూరిటీ సంతకాలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

అచ్యుతాపురంలో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న డెన్‌లపై పోలీసులు గత మంగళవారం రాత్రి దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు 33 మందిని మాత్రమే అదుపులోకి తీసుకోగా, ఇంతకన్నా ఎక్కువ మంది పారిపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపఽథ్యంలో జంగులూరు జంక్షన్‌ సిరిపురం లేఅవుట్‌లోగల భువనేశ్వరి అపార్టుమెంట్‌లోని ఏడు ఫ్లాట్లలో ఉంటున్న వారు కూడా పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. అయితే ఇక్కడ పెంపుడు కుక్క ఉండిపోయింది. దీనిని ఎవరూ గమనించలేదు. శనివారం ఉదయం వాకింగ్‌కి వెళ్లిన కొంతమందికి.. కుక్క మూలుగు వినిపించడంతో వాచ్‌మన్‌ను పిలిచి గది తలుపులు తెరిపించారు. కొన ఊపిరితోఉన్న కుక్కను బయటకు తీసి సపర్యలు చేశారు. శనివారం సాయ్రంత్రం ఒక అపరిచిత మహిళ వచ్చి కుక్కను తీసుకువెళ్లిపోయింది. దీనినిబట్టి పోలీసుల నుంచి తప్పించుకున్న సైబర్‌ నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఈ ప్రాంతంలోనే వున్నారని

స్థానిక నేతల్లో గుబులు

విజయవాడకు చెందిన (..అని చెప్పుకున్నాడు) ఒక వ్యక్తి ఏడాది క్రితం అచ్యుతాపురం వచ్చి కొంతమంది స్థానిక నాయకులతో పరిచయం ఏర్పరచుకున్నాడు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఏదైనా వ్యాపారం పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చామని, అన్నీ పరిశీలించిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆఫీస్‌తోపాటు తాము వుండడానికి అద్దెకు భారీ భవనం కావాలని అడిగారు. స్థానిక నేతల సహకారంతో వెదురువాడలో ఆధునిక వసతులు వన్న ఒక ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ని అద్దెకు తీసుకున్నారు. తరువాత తాము ప్రారంభించబోయే కర్మాగారంలో పనిచేయడానికి ఉద్యోగులు వస్తున్నారని, వారు వుండడానికి అపార్ట్‌మెంట్‌ కావాలని చెప్పడంతో అచ్యుతాపురం-పూడిమడక రహదారిలో కుమారపురం వద్ద ఒక అపార్టుమెంట్‌ను చూపించారు. దీనిని కూడా అద్దెకు తీసుకున్నారు. అచ్యుతాపురంలో మరికొంత మంది నాయకులు, ఇతరులతో పరిచయాలు పెంచుకొని ఒకరికి తెలియకుండా మరొకరి సహకారంతో భోగాపురంలో పవన్‌ అపార్టుమెంట్‌, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే మార్గంలో ఐదంతస్థుల ఉషోదయ అవెన్యూ, జంగులూరు జంక్షన్‌ వద్ద సిరిపురం లేఅవుట్‌లో భువనేశ్వరి అపార్ట్‌మెంట్‌లో ఏడు ఫ్లాట్లు అద్దెకు తీసుకున్నారు. వీటిల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్‌ మోసాలకు దిగారు.

అచ్యుతాపురం-గాజువాక రోడ్డులో రామన్నపాలెం వద్ద ఎస్టీబీఎల్‌ లేఅవుట్‌ సమీపంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ నివాసం ఉంది. దీనికి సుమారు అర కిలోమీటరు దూరంలో ఉషోదయ అవెన్యూను సైబర్‌ నేరగాళ్లు అద్దెకు తీసుకున్నారు. దీని సెల్లార్‌ను పూర్తిగా మూసేశారు. ఎమ్మెల్యే ఇంటికి ఎవరు వెళ్లాలన్నా ఈ అవెన్యూ ముందు నుంచే వెళ్లాలి. సుమారు ఏడాది నుంచి ఇక్కడ సైబర్‌ మోసాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ గుర్తించకపోవటం విశేషం.

పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు

సైబర్‌ నేరగాళ్లు అచ్యుతాపురంలోని ఆటోమొబైల్‌ షోరూమ్‌లో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. అచ్యుతాపురం-గాజువాక రోడ్డులో గల ఒక ద్విచక్రవాహన షోరూంలో ఒకేసారి 15 వాహనాలు కొనుగోలు చేశారని సమాచారం. ఇదే రోడ్డులో పాతవాహనాల విక్రయ కేంద్రం లో కూడా పది ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఒక ఆర్మీ అధికారితోపాటు కొంతమంది స్థానికులు ష్యూరిటీలు ఇచ్చారని తెలిసింది.

Updated Date - May 26 , 2025 | 12:42 AM