ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు
ABN , Publish Date - May 10 , 2025 | 12:11 AM
పట్టణంలో ఎన్టీఆర్ వైద్యాలయం, రైల్వేస్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు నిత్యం వందలాది మంది పేదల కడుపు నింపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 19వ తేదీన పునఃప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు మూడు లక్షల 65 వేల మంది భోజనాలు/ అల్పాహారం చేశారు.

అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ వద్ద ఎనిమిది నెలల క్రితం పునఃప్రారంభం
ఇంతవరకు 3.65 లక్షల మందికి భోజనాలు
అనకాపల్లి టౌన్, మే 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఎన్టీఆర్ వైద్యాలయం, రైల్వేస్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు నిత్యం వందలాది మంది పేదల కడుపు నింపుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 19వ తేదీన పునఃప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు మూడు లక్షల 65 వేల మంది భోజనాలు/ అల్పాహారం చేశారు.
తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుపేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు. కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. పేరు మార్చి, మీకు నచ్చిన పేరు పెట్టుకుని క్యాంటీన్లను కొనసాగించాలని చంద్రబాబుతోపాటు పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు. కానీ వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. కాగా కూటమి అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను తెరిపించారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ వైద్యాలయం, రైల్వేస్టేషన్ల వద్ద వున్న అన్న క్యాంటీన్లను గత ఏడాది సెప్టెంబరు 19వ తేదీన పునఃప్రారంభించారు. ఉదయం అల్ఫాహారంగా ఇడ్లీ, పూరి, పొంగలి పెడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి అన్నం, సాంబారు, పచ్చడి, కూర, పెరుగుతో భోజనం వడ్డిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో ఇప్పటి వరకు లక్షా 90 వేల మంది, రైల్వేస్టేషన్ వద్ద ఉన్న క్యాంటీన్లో లక్షా 75 వేల మంది భోజనాలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద క్యాంటీన్తోపోలిస్తే ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఉన్న క్యాంటీన్కు రద్దీ అధికంగా వుంటున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతోపాటు సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్, కొబ్బరికాయల మార్కెట్ కార్మికులు ఇక్కడ రూ.5కే భోజనం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ వద్ద వున్న క్యాంటీన్లో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు, రిక్షా కార్మికులు, దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించే వారు, వలస కూలీలు భోజనం చేస్తుంటారు. బజార్లో రూ.5కి కనీసం టీ కూడా రాదని, అటువంటిది కడుపు నిండా భోజనం పెడుతున్నారని పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే భోజనం బయట హోటళ్లలో చేయాలంటే కనీసం రూ.100 తీసుకుంటారని చెబుతున్నారు. కాగా క్యాంటీన్లో సిబ్బందిని పెంచాలని, నీడ కోసం షెడ్లు వేయాలని పలువురు కోరుతున్నారు.