ఉత్సాహంగా తొలి అడుగు.
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:35 AM
జిల్లాలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని ప్రజలకు పార్టీ నాయకులు వివరించారు.
జిల్లాలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభం
ఇంటింటికీ వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్న టీడీపీ శ్రేణులు
ప్రజల నుంచి సానుకూల స్పందన
అనకాపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని ప్రజలకు పార్టీ నాయకులు వివరించారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీలోని సీనియర్ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాయకరావుపేట మండలం సీతారాంపురంలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి అధికారులతో మంత్రి చర్చించారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం లంకవానిపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఏడాది పాలనపై ప్రచారం చేశారు. నర్సీపట్నంలో కౌన్సిలర్ చింతకాయల రాజేశ్ ఆధ్వర్యంలో, అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో అర్బన్ ఫైనాన్స్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనపై ప్రజలకు కరపత్రాలు అందజేశారు. రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చోడవరం మండలం రేవెల్లు గ్రామంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైౖర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏడాది సుపరిపాలనపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడలో ఏపీ ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ కార్పొరేషన్ చైౖర్మన్, పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీ, నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజుబాబు ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.