Share News

ఈఎన్‌సీ కమాండ్‌ ఆఫీసర్‌గా అలోక్‌ ఆనంద్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:55 AM

తూర్పు నౌకాదళం కమాండ్‌ అధికారిగా రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఈఎన్‌సీ కమాండ్‌ ఆఫీసర్‌గా అలోక్‌ ఆనంద్‌

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

తూర్పు నౌకాదళం కమాండ్‌ అధికారిగా రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. నేవిగేషన్‌, డైరెక్షన్‌లో నైపుణ్యం కలిగిన ఆయన 1993 జూలైలో నేవీలో చేరారు. ల్యాండింగ్‌ షిప్‌ ఐఎన్‌ఎస్‌ ఘోర్పాడ్‌, ఫ్రిగేట్‌ ఐఎన్‌ఎస్‌ సాత్పుర ఆపరేషన్లలో సేవలు అందించారు. నేవల్‌ హెడ్‌ క్వార్టర్‌లో సిబ్బంది నియామకం, విధానాలు, ప్రణాళికల తయారీ, కమొడోర్‌ ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు. యెమెన్‌లో ఆపరేషన్‌ రాహత్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతిష్టాత్మకమైన యుధ్‌ సేవా మెడల్‌ అందుకున్నారు.


బస్సుల్లో బాణసంచా రవాణా నిషేధం

ప్రత్యేక స్క్వాడ్‌ల ద్వారా కాంప్లెక్సులు, బస్సుల్లో తనిఖీలు

ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సుల్లో బాణసంచా రవాణాను నిషేధిస్తూ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు అన్ని డిపోల మేనేజర్లకు ఉత్తర్వులు జారీచేశారు. బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, మండే గుణమున్న వస్తువులను బస్సుల్లోకి తీసుకురాకూడదన్నారు. స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో కిక్కిరిసి మహిళలు ప్రయాణిస్తున్నారని, ఈ నేపథ్యంలో బాణసంచా తీసుకువెళ్లడం ఎంతో ప్రమాదకరమన్నారు. ఇందుకోసం ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటుచేసి ఆర్టీసీ కాంప్లెక్సులు, బస్సుల్లో తనిఖీలు చేయాలని సూచించారు. బాణసంచాతో ప్రయాణించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ బాటిల్స్‌, గ్యాస్‌ సిలిండర్లు వంటి వాటిని బస్సుల్లో రవాణా చేయరాదని స్పష్టం చేశారు. పార్శిల్‌ బుకింగ్‌లో కూడా బాణసంచాను నిషేధించాలని లాజిస్టిక్స్‌ విభాగం అధికారులను ఆర్‌ఎం అప్పలనాయుడు ఆదేశించారు.

Updated Date - Oct 19 , 2025 | 12:55 AM