ఇంటర్ సప్లిమెంటరీలో అల్లూరి జిల్లా టాప్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:18 PM
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలోనే అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా టాప్లో నిలిచింది.
ఫస్టియర్లో 76 శాతం, సెకండియర్లో 91శాతం ఉత్తీర్ణత
రెండు, మూడు స్థానాల్లో పార్వతీపురం మన్యం,
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు
పాడేరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలోనే అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా టాప్లో నిలిచింది. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 2,304 మంది హాజరుకాగా 1,751 మంది పాస్ కావడంతో 76 శాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 74 శాతంతో రెండో స్థానం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 54 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే జిల్లాలో ఇంటర్ రెండో ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు 1,508 మంది హాజరుకాగా 1,368 మంది పాస్ కావడంతో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 87 శాతంతో రెండో స్థానం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 77 శాతంతో మూడో స్థానం దక్కించుకున్నాయి. అయితే ఇంటర్ విద్యాబోధన, పలు సంస్కరణ నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని ఇంటర్బోర్డు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.