ఏవోబీలో అలర్ట్
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:34 AM
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగారులో భాగంగా ఛత్తీస్గఢ్లో వరుస ఎదురు కాల్పులు జరగడం, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్ బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చింది.
నేడు మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు
రాత్రి వేళ బస్సులను రద్దు చేసిన ఆర్టీసీ అధికారులు
చింతపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగారులో భాగంగా ఛత్తీస్గఢ్లో వరుస ఎదురు కాల్పులు జరగడం, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్ బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా బసవరాజ్ అమరుల స్మారక సభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రధాన కేంద్రాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గిరిజన గ్రామాలకు వెళ్లే రాత్రి వేళ బస్సులను పోలీసుల సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నది. దీంతో మావోయిస్టు పార్టీకి సురక్షిత ప్రాంతంగా పేరొందిన ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుస ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వందల మంది మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. ఇదే సమయంలో సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఏవోబీ సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసేందుకు రెండు నెలల క్రితం మావోయిస్టులు ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్టు పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మే 7వ తేదీన వై.రామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏవోబీ ఎస్జెడ్సీ సభ్యుడు జగన్ అలియాస్ కాకూరి పండన్న, ఛత్తీస్గఢ్కి చెందిన ఏవోబీ ఎస్జెడ్సీ సభ్యుడు రమేశ్ మృతి చెందారు. 21వ తేదీన మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఎదురు కాల్పుల్లో మృతి చెందడం ఇదే ప్రథమం. ఈ ఘటనను మావోయిస్టు పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
బంద్ విజయవంతానికి మావోయిస్టుల ప్రణాళిక
సీపీఐ మావోయిస్టులు బంద్, అమరవీరుల స్మారక సభలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మావోయిస్టు చర్యలతో పాటు బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు అడవులకు ప్రత్యేక బలగాలను పంపించారు. ఓ వైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులపై ఆరా తీస్తూ గుర్తింపు కార్డులను పరిశీలించి విడిచి పెడుతున్నారు. మరోవైపు మావోయిస్టు టార్గెట్లో ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వీఐపీలకు అదనపు భద్రత కల్పించారు.
ఆర్టీసీ బస్సులు రద్దు
గిరిజన ప్రాంతం మీదుగా రాత్రి వేళ ప్రయాణించే ఆర్టీసీ బస్సులన్నీ రద్దు చేశారు. ప్రధానంగా దూర ప్రాంతాలకు వెళ్లే భద్రాచలం, సీలేరు, హైదరాబాద్, మల్కన్గిరి ఎక్స్ప్రెస్లతో పాటు అల్లూరి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులను ఎప్పుడు పునరుద్ధరిస్తానే విషయంపై స్పష్టతలేదు. రాత్రి వేళ బస్సులను రద్దు చేయడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ముమ్మరంగా గాలింపు
కొయ్యూరు: మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. గతంలో మావోయిస్టు హిట్లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు ముందస్తు నోటీసులు జారీ చేసి మైదానానికి తరలి పోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, తదితర ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించారు.