అడ్వంచర్స్ స్పోర్స్ట్ నిర్వాహకుడు కాశీపై కేసు
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:01 AM
పోర్టు స్టేడియంలోని విశ్వనాథ్ అడ్వంచర్స్ స్పోర్ట్సు నిర్వాహకుల నిర్లక్ష్యంకారణంగానే రిషిత్ అనే బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు.

ఈతకొలనులో బాలుడి మృతికి
యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని విచారణలో వెల్లడి
ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడి
సీతంపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
పోర్టు స్టేడియంలోని విశ్వనాథ్ అడ్వంచర్స్ స్పోర్ట్సు నిర్వాహకుల నిర్లక్ష్యంకారణంగానే రిషిత్ అనే బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్లో సీసీ కెమెరాలు, లైఫ్ గార్డ్స్ లేవని తమ దర్యాప్తులో తేలిందన్నారు. సమయం దాటినా టికెట్లు విక్రయించడం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయన్నారు. ఇక ఏడేళ్ల బాలుడు రిషిత్కు సంబంధించి తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. అయితే విచారణ అనంతరం స్పోర్ట్స్ కాంప్లెక్స్ యజమాని, నిర్వాహకుడు కాశీవిశ్వనాఽథ్ తగిన రక్షణ చర్యలు చేపట్టలేదని, ఆయన అజాగ్రత్త వల్ల రితీష్ మృతిచెందినట్టు తేలిందన్నారు. దాంతో బుధవారం సెక్షన్లు మార్చి నిర్వాహకుడు కాశీవిశ్వనాఽథ్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. యాజమాన్యంపై కోర్టులో అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేస్తామన్నారు.