అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ప్రవేశాలకు వేళాయె
ABN , Publish Date - May 29 , 2025 | 11:49 PM
సామాన్య, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తున్న కోర్సుల్లో అగ్రికల్చర్ డిప్లొమా ముందు వరుసలో వుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు ఏజీబీఎస్పీని అభ్యసించే అవకాశముంది.
డిప్లొమా కోర్సుతో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
గ్రామీణ, గిరిజన విద్యార్థులకు సువర్ణావకాశం
ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసిన ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం
టెన్త్ ఉత్తీర్ణత, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అర్హులు
వచ్చే నెల 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
చింతపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): సామాన్య, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తున్న కోర్సుల్లో అగ్రికల్చర్ డిప్లొమా ముందు వరుసలో వుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు ఏజీబీఎస్పీని అభ్యసించే అవకాశముంది. దీంతో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సైతం అగ్రికల్చర్ డిప్లొమాను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ప్రవేశాలకు గుంటూరు ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు జూన్ 16లోగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్య, మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పదవ తరగతి అర్హతతో వ్యవసాయ విద్య ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలపరిమితి గల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సును 1999 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పాలిటెక్నిక్ 16 ప్రభుత్వ, 40 ప్రైవేటు కళాశాలలు, విత్తన సాంకేతిక(సీడ్ టెక్నాలజీ) పాలిటెక్నిక్ ఒక ప్రభుత్వ, ఆరు ప్రైవేటు, వ్యవసాయ యాంత్రీకరణ(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పాలిటెక్నిక్ రెండు ప్రభుత్వ, 11 ప్రైవేటు, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ ఒక ప్రభుత్వ కళాశాల వుంది. ప్రభుత్వ కళాశాల పరిధిలో 688, ప్రైవేటు కళాశాలల్లో 1,690 సీట్లు వున్నాయి.
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల వివరాలు
అగ్రికల్చర్ డిప్లొమాలో నాలుగు రకాల కోర్సులు వున్నాయి. రెండేళ్ల కాలపరిమితి కలిగిన కోర్సుల్లో వ్యవసాయ పాలిటెక్నిక్, విత్తన సాంకేతిక, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్, మూడేళ్ల కాలపరిమితి కలిగిన వ్యవసాయ యాంత్రీకరణ కోర్సులు వున్నాయి.
అర్హతలు: పదవ తరగతి గాని, తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ అర్హులు. ఓపెన్ స్కూల్, ఇన్స్టెంట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్ పాసైన విద్యార్థులు అనర్హులు. విద్యార్థి దరఖాస్తు చేసుకునే సమయానికి 22 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.
రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీ-ఏ 7, బీసీ-బీకి 10, బీసీ-సీకి ఒకటి, బీసీ-డికి 7, బీసీ-ఈకి 4, దివ్యాంగులకు 3, ఎక్స్సర్వీస్మన్కి 2, ఎన్సీసీకి ఒకటి, క్రీడాకారులకి 0.5, మహిళా విద్యార్థులకు 33.3 శాతం సీట్లు ఉంటాయి. వివిధ వర్గాలకు కేటాయించగా మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం
అర్హులైన విద్యార్థులు ఠీఠీఠీ.్చుఽజట్చఠ.్చఛి.జీుఽ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 16వ తేదీ రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 పరీక్ష ఫీజు చెల్లించి, అనంతరం దరఖాస్తును ఆన్లైన్లో నింపి సబ్మిట్ చేయాల్సి వుంటుంది.