Share News

కేజీబీవీలకు అదనపు వసతులు

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:57 AM

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) అదనపు వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 20 కేజీబీవీల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ.7.74 కోట్లు మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో 17 కేజీబీవీల్లో డిజిటల్‌ కంప్యూటర్‌ తరగతి గదులు నిర్మాణంలో ఉన్నాయి.

కేజీబీవీలకు అదనపు వసతులు
కె.కోటపాడు మండలం గొల్లలపాలెంలో కేజీబీవీ ప్రాంగణంలో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనం

జిల్లాలోని 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో వివిధ పనులకు రూ.7.74 కోట్లు మంజూరు

- నిర్మాణంలో డిజిటల్‌ లైబ్రరీలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ గదులు

- తుది దశకు చేరిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) అదనపు వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 20 కేజీబీవీల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ.7.74 కోట్లు మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో 17 కేజీబీవీల్లో డిజిటల్‌ కంప్యూటర్‌ తరగతి గదులు నిర్మాణంలో ఉన్నాయి. 11 చోట్ల డిజిటల్‌ గ్రంథాలయ గదులు, 2 చోట్ల ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ గదుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. 20 కేజీబీవీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, అవసరమైన చోట ప్రహరీ గోడల నిర్మాణ పనులు చేపడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కంప్యూటర్‌ గదులు, డిజిటల్‌ లైబ్రరీల్లో అధునాతన కంప్యూటర్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ గదుల్లో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తుది దశలో నిర్మాణ పనులు

జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన 53 నిర్మాణ పనులకు రూ.7.74 కోట్లు మంజూరు కాగా, రూ.4.29 కోట్ల వ్యయంతో 26 పనులను పూర్తి చేశారు. అయితే కె.కోటపాడు మండలంలోని ఒక కేజీబీవీ ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. మిగిలిన నిర్మాణ పనులన్నీ వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కేజీబీవీల్లో మరుగుదొడ్లు, సైన్స్‌ ల్యాబ్స్‌, ఆర్‌వో ప్లాంట్‌ల ఏర్పాటు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల కోసం అదనపు గదుల నిర్మాణాలు, మరమ్మతులు, నీటి సరఫరా, విద్యుత్‌, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు.

వంట పాత్రల పంపిణీ

జిల్లాలో అన్ని కేజీబీవీలకు ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అధునాతన వంట పాత్రలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కేజీబీవీలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. స్టీల్‌ స్టౌవ్‌లు, వంట పాత్రలు, వెట్‌ గ్రైండర్లు, ఫ్రీజ్‌లు, ఇనుప బీరువాలు, మిక్సీలు అందజేస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కేజీబీవీల్లో వంట సామగ్రి పంపిణీ చేయకపోవడంతో సిబ్బంది వంట చేసేందుకు ఇబ్బందులు పడేవారు. అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది కేజీబీవీలకు వంట పరికరాలు, పాత్రలు అందజేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:57 AM