Share News

ఆధార్‌ అప్‌డేట్‌కు పాట్లు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:58 AM

రేషన్‌ కార్డుదారులు ఆధార్‌ అప్‌డేట్‌ కోసం నమోదు కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కేంద్రాలను ఉదయం పది గంటలకు తెరుస్తుండగా... ఆరు గంటలకే చిన్నపిల్లలతోసహా ఆయా కేంద్రాల వద్దకు వచ్చి బారులు తీరుతున్నారు. వేసవి కావడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆధార్‌ అప్‌డేట్‌కు పాట్లు
పోస్టాఫీసు తెరవకముందే ఆధార్‌ అప్‌డేట్‌ కోసం బారులు తీరిన రేషన్‌కార్డుదారులు

గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి

రోజుకు 25-30 మందికి మాత్రమే నమోదు

కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుదారులు ఆధార్‌ అప్‌డేట్‌ కోసం నమోదు కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కేంద్రాలను ఉదయం పది గంటలకు తెరుస్తుండగా... ఆరు గంటలకే చిన్నపిల్లలతోసహా ఆయా కేంద్రాల వద్దకు వచ్చి బారులు తీరుతున్నారు. వేసవి కావడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలమంచిలిలో ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలు ఆరు వున్నాయి. పట్టణంతోపాటు మండలంలోని అన్ని పంచాయతీల రేషన్‌కార్డుదారులు ఇక్కడే ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలి. దీంతో ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మిగిలిన కేంద్రాల కన్నా పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రానికి రద్దీ అధికంగా వుంటున్నది. దీనికితోడు గత రెండు రోజులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఆధార్‌ అప్‌డేట్‌ ఆలస్యంగా సాగింది. దీంతో కొంతమంది విసుగు చెంది ఇళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం ఉదయం ఆధార్‌ నమోదు కేంద్రాలకు వచ్చారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. ఒక్కో వ్యక్తికి ఆధార్‌ అప్‌డేట్‌ లేదా మార్పులు/ చేర్పులు చేయడానికి 10-15 నిమిషాలు పడుతున్నది. దీంతో రోజు మొత్తం మీద 25-30 మందికి మాత్రమే ఆధార్‌ అప్‌డేట్‌ చేయగలుగుతున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:58 AM