Share News

మావోయిస్టులకు గట్టి దెబ్బ

ABN , Publish Date - May 08 , 2025 | 12:55 AM

సీపీఐ మావోయిస్టు ఉద్యమంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సాయుధ పోరాటం సాగించిన జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.

మావోయిస్టులకు గట్టి దెబ్బ
జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న (ఫైల్‌ ఫొటో)

ఎదురు కాల్పుల్లో జగన్‌ మృతి

మూడు రాష్ట్రాల్లో అతనిపై 100కు పైగా కేసులు

సీలేరు, మే 7: సీపీఐ మావోయిస్టు ఉద్యమంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సాయుధ పోరాటం సాగించిన జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌ స్వగ్రామం జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామం. అతను 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పోరాటానికి ఆకర్షితుడై గాలికొండ ఏరియా కమిటీలో దళ సభ్యుడుగా చేరాడు. కేవలం ప్రాథమిక విద్య అభ్యసించిన అతను పార్టీలో చేరిన తరువాత ఆయుధాల వినియోగం, మందు పాత్రలు అమర్చడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించుకున్నాడు. మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడుగా పోరాట జీవితాన్ని ప్రారంభించి దళం కమాండర్‌గా, ఏసీఎం, డీసీఎంగా పనిచేసి ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడు స్థాయికి చేరుకున్నాడు. అతను పలు ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాడు. అతనిపై ఒడిశా, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో 100కు పైగా కేసులు ఉన్నాయి. అతనిపై ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది. తూర్పుకనుముల ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేత, తెలుగు క్యాడర్‌ కలిగి జగన్‌ను రెండేళ్లగా ఆంధ్రా పోలీసులు టార్గెట్‌ చేశారు. అయితే అతను కొంత కాలంగా ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్నాడు. తూర్పు కనుముల ప్రాంతానికి వచ్చినప్పటికి పోలీసులకు చిక్కేవాడు కాదు. అతని తల్లి కాకూరి సీతమ్మ చనిపోయిన సమయంలోనైనా వస్తాడని పోలీసులు భావించారు. కొద్ది రోజుల తరువాత అతను కొమ్ములవాడ వచ్చాడన్న సమాచారంతో పోలీసు బలగాలు మోహరించినప్పటికీ అతను చిక్కలేదు.

Updated Date - May 08 , 2025 | 12:55 AM