ఇంటింటా సర్వే
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:07 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘యునైటెడ్ ఫ్యామిలీ సర్వే’కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి 2026 జనవరి 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలి. ఇందులో భాగంగా మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో సచివాలయాల సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు.
రేపటి నుంచి ప్రారంభం
‘కుటుంబ’ వివరాలు సేకరించనున్న సచివాలయాల సిబ్బంది
ప్రత్యేక యాప్లో నమోదు
వచ్చే నెల 12వ తేదీతో పూర్తి
అనకాపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘యునైటెడ్ ఫ్యామిలీ సర్వే’కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి 2026 జనవరి 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలి. ఇందులో భాగంగా మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో సచివాలయాల సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. బుధవారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. గురువారం నుంచి సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సమగ్ర వివరాలు సేకరిస్తారు. వీటిని యూఎఫ్ఎస్ ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసి ఈకేవైసీ చేయనున్నారు. ప్రతి కుటుంబంలో ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, ఇతర వివరాలను సేకరిస్తారు. ఆధార్ నంబర్, మొబైల్ నంబరు, కుటుంబ ఆదాయం, స్థిరాస్తుల వివరాలను యాప్లో పొందుపరుస్తారు. సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది. జిల్లాలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో 3,600 మంది సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారని జిల్లా సమన్వయకర్త మంజులావాణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని సచివాలయాల ఉద్యోగులను ఆదేశించినట్టు చెప్పారు.