Share News

అంబరాన్ని తాకిన హోలీ సంబరం

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:29 PM

మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయం ప్రాంగణంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి.

అంబరాన్ని తాకిన హోలీ సంబరం
జెండా కోసం కర్రలపోటు చుట్టూ నించున్న యువకులు, తిలకిస్తున్న ప్రజలు

తాజంగి బీటాలైన్‌లో ఘనంగా వేడుకలు

జెండా దొరికిన యువకుడికి సన్మానం, ఊరేగింపు

చింతపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయం ప్రాంగణంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. తాజంగి పంచాయతీ పరిసర ప్రజలు ప్రతి ఏటా హోలీ పండగనాడు రాఽధాకృష్ణ ఆలయం ఎదుట 60 అడుగుల ఎత్తు కలిగిన కర్రల పోగును కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అదేరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్రలపోగుకు నిప్పుపెట్టారు. ఉదయం ఆరు గంటల వరకు ఈ కర్రల పోగు కాలుతూ కనిపించింది. ఈ రమణీయమైన దృశ్యాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

జెండాను పట్టుకున్న బీటాలైన్‌ యువకుడు

కర్రల పోగుపైన ఏర్పాటుచేసిన జెండాను స్థానిక తాజంగి బీటాలైన్‌ గ్రామానికి చెందిన సీసా సుందరరావు అనే యువకుడు పట్టుకున్నాడు. ఉదయం నాలుగు గంటల నుంచి జెండాను పట్టుకునేందుకు కర్రల పోగుచుట్టూ పలు గ్రామాల యువకులు, పెద్దలు చేరుకున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు కర్రలపోగు నుంచి జెండా వేరు పడి ఉత్తర దిక్కున పడింది. ఈ జెండాను పట్టుకున్న యువకుడుని ఆలయ కమిటీ శాలువతో సన్మానించి రూ.1,116 నగదును అందజేశారు. అలాగే యువకుడు సుందరరావును ఆలయం నుంచి గృహం వరకు ఆలయ కమిటీ ఊరేగింపుగా తీసుకొచ్చింది. రానున్న ఖరీఫ్‌లో నాట్లును జెండా పట్టుకున్న యువకుడుతో స్థానిక గిరిజనులు మొదటిగా వేయిస్తారు. ఈ ఉత్సవంలో సర్పంచ్‌ వంతల మహేశ్వరరావు, అర్చకులు సీసా నీలకంఠం, ఉత్సవ కమిటీ సభ్యులు బాబూరావు, సదాశివ, రాజరావు, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 10:29 PM