గూడు లేని విద్యా శాఖ
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:10 PM
స్థానిక మండల విద్యాశాఖ అధికారులకు సొంత గూడు లేకుండా పోయింది. ఈ కార్యాలయ భవనం ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు వినియోగించడం లేదు. ప్రస్తుతం భవిత కేంద్రంలోని ఓ చిన్న గదిలో విధులు నిర్వహిస్తూ అధికారులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.
శిథిలమైన కార్యాలయ భవనం
భవిత కేంద్రంలోని ఇరుకు గదిలో
కార్యాలయం నిర్వహణ
అదే గదిలో ఇద్దరు ఎంఈవోలు విధులు
ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం
చింతపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):
స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 40ఏళ్ల క్రితం ఎంఈవో కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలే స్థితిలో ఉండడంతో దీనిని ఖాళీ చేసేశారు. ప్రత్యామ్నాయ భవనాలు అందుబాటులో లేవు. గతంలో మండలానికి ఒక ఎంఈవో ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరిని ప్రభుత్వం నియమించింది. అయితే విద్యాశాఖ అధికారుల విధులు నిర్వహణకు కనీస సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు, అధికారులు విఫలమయ్యారు. శిథిలావస్థకు చేరి విద్యాశాఖ కార్యాలయాన్ని మరమ్మతులకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. నూతన భవనం నిర్మాణం ఊసే లేదు. కనీసం ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనాలు విద్యాశాఖ కార్యాలయం నిర్వహణకు కేటాయించిందీ లేదు. ఫలితంగా ఇద్దరు ఎంఈవోలు భవిత కేంద్రంలో ఒక చిన్నగదిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, పాలకులు స్పందించలేదు. శిథిలావస్థకు చేరుకున్న విద్యాశాఖ భవనాన్ని మరమ్మతులు చేపట్టడం గాని, ప్రత్యామ్నాయ భవనాలు కేటాయించడం గాని చేయాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.