Share News

మన్యంపై మంచు దుప్పటి

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:37 PM

మన్యంలో బుధవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం పది గంటలైనా పొగమంచు వీడలేదు.

మన్యంపై మంచు దుప్పటి
పాడేరు- జి.మాడుగుల మార్గంలో బుధవారం ఉదయం దట్టంగా కమ్మేసిన పొగమంచు

ఉదయం 10 గంటల వరకు వీడని మంచు తెరలు

జి.మాడుగులలో 5.4 డిగ్రీలు నమోదు

పాడేరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం పది గంటలైనా పొగమంచు వీడలేదు. శీతాకాలం నేపథ్యంతో పాటు వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం వేళలో మాత్రమే ఒక మోస్తరుగా ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉంటుంది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా సింగిల్‌ డిజిట్‌ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలుకొనసాగుతున్నాయి. బుధవారం జి.మాడుగులలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ముంచంగిపుట్టులో 7.0, అరకులోయ, డుంబ్రిగుడలో 7.2, పెదబయలులో 7.8, చింతపల్లిలో 8.2, పాడేరులో 8.3, హుకుంపేటలో 9.6, కొయ్యూరులో 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొయ్యూరులో...

కొయ్యూరు: మండలంలో చలి తీవ్రత అధికంగా ఉంది. బుధవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీచాయి. దీంతో చలికి జనం గజగజ వణుకుతున్నారు.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. బుఽదవారం మండల కేంద్రంలో ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు దట్టంగా కురుస్తూనే ఉంది. ఉదయం వెళ్లే బయటకు రావడానికి జనం సాహసించడం లేదు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి చలి ప్రారంభమవుతోంది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:37 PM