Share News

5 ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు సీజ్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:23 PM

కర్నూలులో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

5 ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు సీజ్‌
నక్కపల్లి టోల్‌ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న రవాణాశాఖాధికారులు

కొనసాగుతున్న ఆర్టీవో తనిఖీలు

అనకాపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. శనివారం 5 బస్సులను సీజ్‌ చేశారు. అనకాపల్లి జాతీయ రహదారి కూడలి, నక్కపల్లి, మర్రిపాలెం టోల్‌ ప్లాజాల వద్ద జిల్లా రవాణాశాఖాధికారి జి.మనోహర్‌ నేతృత్వంలో శనివారం ఉదయం నుంచి ఆ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. లైసెన్స్‌లు, సరైన ఫిట్‌నెస్‌ లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. పెండింగ్‌ చలాన్లను చెల్లిస్తేనే వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. ఈ తనిఖీల్లో 12 కేసులు నమోదు చేసి, ఎమర్జెన్సీ ఎక్సిట్‌ ద్వారాలు సరిగ్గా లేని కారణంగా ఐదు ప్రైవేటు బస్సులను సీజ్‌ చేసినట్టు ఆర్టీవో మనోహర్‌ తెలిపారు. ఈ తనిఖీలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:23 PM