3.63 కిలోల హాష్ ఆయిల్ పట్టివేత
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:52 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని డి.గొందూరు పంచాయతీ కరకపుట్టు జంక్షన్ వద్ద శనివారం 3.62 కిలోల గంజాయి నూనె (హాష్ ఆయిల్) స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ కె.సురేష్ తెలిపారు.
ఒకరి అరెస్టు
పట్టుబడిన లిక్విడ్ గంజాయి
విలువ రూ.8 లక్షలు
పాడేరురూరల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని డి.గొందూరు పంచాయతీ కరకపుట్టు జంక్షన్ వద్ద శనివారం 3.62 కిలోల గంజాయి నూనె (హాష్ ఆయిల్) స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ కె.సురేష్ తెలిపారు. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్వీ.మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డి.గొందూరు పంచాయతీకి చెందిన కరకపుట్టు జంక్షన్ వద్ద శనివారం వాహన తనిఖీలను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ అలగాం గ్రామానికి చెందిన వండలం చినబాలన్న (41)ని తనిఖీ చేయగా.. నాలుగు పాలిథిన్ కవర్లలో గంజాయి నూనె (హాష్ ఆయిల్) గుర్తించామన్నారు. ఒక ప్యాకెట్లో 730 గ్రాములు, 2వ ప్యాకెట్లో 1,030 గ్రాములు, 3వ ప్యాకెట్లో 880 గ్రాములు, 4వ ప్యాకెట్లో 1,050 గ్రాములు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన హాష్ ఆయిల్ విలువ రూ.8 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో మరో నిందితుడు అదే గ్రామానికి చెందిన వండలం కృష్ణారావు (25)గా గుర్తించామని, త్వరలోనే ఆ వ్యక్తిని అరెస్టు చేస్తామన్నారు. అరెస్టు చేసిన చినబాలన్నను పాడేరు ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించామన్నారు. ఈ దాడుల్లో సీఐ బి.జగదీశ్వరరావు, ఎస్ఐలు టీవీ.గిరిబాబు, సీహెచ్.చినవీర్రాజు, హెచ్సీలు ఎంఎస్.రాజు, ఎంఎస్.నాయుడు, పీసీలు బి.కిరణ్, వి.సంతోష్, సీహెచ్.రమేశ్ పాల్గొన్నారు.