ట్రిపుల్ ఐటీలకు 155 మంది ఎంపిక
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:41 AM
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను రాజీవ్గాంధీ యూని వర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది.
ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసిన ఆర్జీయూకేటీ
30 నుంచి కౌన్సెలింగ్
జూలై 14వ తేదీ నుంచి తరగతులు
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను రాజీవ్గాంధీ యూని వర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ (కడప), ఒంగోలు, శ్రీకాకుళంలో గల ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కోసం వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం 50,541 మంది దరఖాస్తు చేసుకోగా, పదో తరగతి మార్కు లను ప్రామాణికంగా తీసుకుని 4,040 మందిని ఎంపిక చేశారు. వీరిలో 94.78 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు కాగా, 5.22 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్నవారని అధికారులు వెల్లడించారు. ఆయా ట్రిపుల్ ఐటీల్లో జిల్లాకు చెందిన 155 మంది సీట్లను దక్కించుకున్నారు. వీరిలో 37 మంది నూజివీడు, పది మంది విద్యార్థులు కడపలోని ఆర్కే వ్యాలీ, 22 మంది ఒంగోలు, 86 మంది శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందారు. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు కాల్ లెటర్స్ను వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్న్ నంబర్ 9552300009 ద్వారా కూడా పొందవచ్చునని అధికారులు తెలిపారు. ప్రవే శాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే ఐదో తేదీ వరకూ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూలై 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం విమానాశ్రయంలో చిన్న విమానం చక్కర్లు
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఓ చిన్న విమానం చక్కర్లు కొట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రన్వే నిర్మాణం పూర్తయిన తరువాత దానిని పరిశీలించే క్రమంలో ఈ విమానాన్ని రప్పించినట్టు సమాచారం. వచ్చే జూన్ నాటికి ఇక్కడి నుంచి విమానాలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర పౌర విమాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు తరచూ భోగాపురం వెళ్లి నిర్మాణ పనులపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరుగుతోంది.
రైళ్ల రీ షెడ్యూల్ గంటలకొద్దీ ఆలస్యం
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):
సాంకేతిక కారణాల వల్ల పలు రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. దీంతో సోమవారం విశాఖ, దువ్వాడ మీదుగా వివిధ ప్రాంతాలకు నడిచే ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 10.40 గంటలకు హౌరాలో బయలుదేరాల్సిన హౌరా-బెంగళూరు సూపర్ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్ (22863) మధ్యాహ్నం 12.40 గంటలకు, ఉదయం 10.35 గంటలకు బెంగళూరులో బయలుదేరాల్సిన బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్ (12864) మధ్యాహ్నం 12.30 గంటలకు, ఉదయం 7.25 గంటలకు టాటానగర్లో బయలుదేరాల్సిన టాటానగర్-విశాఖ ఎక్స్ప్రెస్ (20815) 8.45 గంటలకు, రాత్రి 7.10 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు (08583) రాత్రి 8.20 గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-భవానీపాట్న పాసింజర్ (58504) రాత్రి 7.30 గంటలకు బయలుదేరాయి. ఆదివారం రాత్రి 11.20 గంటలకు హౌరాలో బయలుదేరాల్సి హౌరా-పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ (12867) సోమవారం వేకువజామున 1.20 గంటలకు బయలుదేరింది. సోమవారం రాత్రి 7.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరాల్సిన శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైలు (07426) అర్ధరాత్రి 12.10 (తెల్లవారితే మంగళవారం) గంటలకు బయలుదేరింది. రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.