VinFast Company: తెలంగాణ, ఏపీతో విన్ గ్రూప్ చర్చలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:27 AM
వియత్నాం విన్ఫాస్ట్ సంస్థ తమిళనాడులో ఇప్పటికే ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడా ఈవీల తయారీకి చర్చలు జరుపుతోంది.
ఈవీ ప్లాంట్ నెలకొల్పే యోచనలో వియత్నాం సంస్థ
ఇప్పటికే తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు
హయ్ ఫాంగ్ (వియత్నాం), జూన్ 1: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీసంస్థ విన్ఫా్స్ట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. విన్ గ్రూప్కు చెందిన విన్ఫా్స్ట రూ.17 వేల కోట్లతో ఈవీల తయారీ యూనిట్ను ఇప్పటికే తమిళనాడులోని తూతుకుడిలో ఏర్పాటు చేస్తోంది. ‘‘మేం భారత్లో చాలా రాష్ట్రాల్లో పర్యటించాం. అనేక ప్రాంతాలను పరిశీలించాం. చివరికి తూతుకుడిలో ఈవీల ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మౌలిక సదుపాయాలు బాగున్నాయి. సమీపంలోనే నౌకాశ్రయం, విమానాశ్రయం ఉన్నాయి’’ అని విన్ఫా్స్ట ఆసియా సీఈవో ఫామ్ సాన్ చౌ చెప్పారు. ఈ ఏడాది పండగ సీజన్లోపే వీఎఫ్6, వీఎఫ్7 ఈవీలను భారత మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపారు. తాము ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత మార్కెట్ చాలా కీలకమని, తాము మరింత విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. తమిళనాడుతో పాటు తెలంగాణ, ఏపీల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. గత 15 నెలలుగా తమిళనాడులో ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. భారత, తమిళనాడు ప్రభుత్వాలు తమకు ఎంతగానో సహకరిస్తున్నాయని చెప్పారు. భారత్, వియత్నాం మధ్య ఎన్నో ఏళ్ల నుంచి దృఢమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు.