Share News

ఏసీబీ కేసులో బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Jan 02 , 2025 | 02:36 AM

వైసీపీ ప్రభుత్వంలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్‌కు ప్రకటనల జారీ,

ఏసీబీ కేసులో బెయిల్‌ ఇవ్వండి

సమాచార శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి పిటిషన్‌

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్‌కు ప్రకటనల జారీ, సొమ్ము చెల్లింపు విషయంలో కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సమాచార పౌరసంబంధాలశాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు రానుంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ పత్రిక, జగన్‌ టీవీ చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సాక్షి మీడియా గ్రూపులో పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ఐ అండ్‌ పీఆర్‌, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లలో ఉద్యోగులుగా చట్టవిరుద్ధ నియామకాలు జరిపారంటూ అప్పటి ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏపీ మీడియా ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.దిల్లీబాబురెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ప్రాథమికంగా విచారణ జరిపిన ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Jan 02 , 2025 | 02:36 AM