Minister Dola: గురుకులాలపై పెరిగిన నమ్మకం
ABN , Publish Date - May 10 , 2025 | 05:28 AM
గురుకులాలపై నమ్మకం పెరుగుతోందని, ప్రవేశాలకు పోటీ గణనీయంగా పెరిగిందని మంత్రి డోలా అన్నారు. విద్యార్థుల ఆరోగ్య సహాయం కోసం రూ.5 కోట్ల నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు

వైద్య సాయానికి 5 కోట్లతో నిధి: మంత్రి డోలా
ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు పోటీ పెరిగిందని, వీటిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం తాడేపల్లి ఏపీ ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఎంట్రన్స్ నిర్వహించినట్టు తెలిపారు.
5వ తరగతిలో 15,020 సీట్లు అందుబాటులో ఉండగా 39,281 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి 13,680 సీట్లు అందుబాటులో ఉంటే 40,792 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇకపై ప్రతినెలా కెరీర్ గైడెన్స్పై విద్యార్థులకు అవగాహన పెంచేలా ఒక క్లాస్ నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్థిక సహాయం సమకూర్చడానికి రూ.5 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు.